ఎవరికి ఓటు వేస్తారో మీ ఇష్టం: కులం కాదు..ధర్మం ముఖ్యం: చీమగా, దోమగా పుట్టినా: బండి సంజయ్
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్.. సోమవరం ఉదయం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. పార్టీ రాష్ట్ర నాయకులు, గ్రేటర్ హైదరాబాద్ విభాగం నేతలతో కలిసి ఈ ఉదయం మహాకాళి అమ్మవారిని ఆలయానికి చేరుకున్నారు. ఆలయ పాలక మండలి సభ్యులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ముగిసిన మరుసటి రోజే ఆలయానికి వెళ్లారు.
తాను, తన కుటుంబం అనే స్వార్థం నుంచి ప్రతి ఒక్కరు బయటికి రావాలని సూచించారు. ప్రతి వ్యక్తి కూడా సమాజం శ్రేయస్సు కోసం పని చేయాలని, అప్పుడే అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయని అన్నారు. ఇది కేవలం హిందు సమాజంలోనే సాధ్యమని చెప్పారు. హిందు సమాజం ఎవరికీ వ్యతిరేకం కాదని, అయినప్పటికీ హేళనకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చీలికలకు గురవుతోందని, అది బాధాకరమని వ్యాఖ్యానించారు. కులాల పేరుతో, వర్గాల పేరుతో హిందు సమాజం చీలిపోవడానికి అవకాశం ఇవ్వొద్దని విజ్ఙప్తి చేశారు.
కులం కాదు.. ధర్మం ముఖ్యమని బండి సంజయ్ చెప్పారు. ప్రతి ఒక్కరు తాను హిందువునని, గర్వంగా తలెత్తుకుని తిరిగే పరిస్థితులు ఏర్పడాలని తాను అమ్మవారిని ప్రార్థించానని అన్నారు. భాగ్యనగర ప్రజలు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. తప్పుడు ప్రచారాలను విశ్వసించ వద్దని కోరారు. సంస్కృతి, సంప్రదాయాలకు భారత్ నిలయంగా మారిన భారత్లో జన్మించే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమని ఆయన చెప్పారు.
భారత్లో జన్మించే అవకాశం తమకు దక్కలేదని విదేశీయులు బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మరో జన్మ అంటూ ఉంటే ఈ పవిత్ర భూమిలో చీమగా, దోమగా జన్మించే అవకాశం కలగాలను విదేశీయులు ప్రార్థిస్తుంటారని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కును వినియోగించుకోవడం ముఖ్యమని చెప్పారు. ఎవరికి ఓటు వేస్తారో.. ప్రజలే నిర్ణయించుకోవాలని, ప్రలోభాలు, డబ్బులకు లొంగి ఓటు హక్కును దుర్వినియోగం చేసుకోవద్దని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పునరుద్ఘాటించారు.