మద్యం పై తెలంగాణ బీజేపి యుద్దం..! దశలవారీగా నిషేదించాలంటున్న డీకే అరుణ..!!
హైదరాబాద్ : తెలంగాణలో మరో ఉద్యమానికి బీజం పడుతోంది. సమాజంలో యువత చెడిపోడానికి, మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోడానికి విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న మద్యం ప్రధాన కారణమని తెలంగాణ బీజేపి ఆరోపిస్తోంది. అంతే కాకుండా తెలంగాణలో దశల వారీగా మధ్యాన్ని నిషేదించాలని ఆ పార్టీ మహిళా విభాగం డిమాండ్ చేస్తోంది. అందులో భాగంగా గురు, శుక్ర రెండు రోజుల పాటు మద్యాపానాన్ని నిషేదించాలని కోరూతూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా పార్టీ సీనియర్ నేత డీకే అరుణ నేతృత్వంలో నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తెలంగాణ బీజేపి నేతలు.
మద్యాన్ని నిషేదించాలి.. మహిళను రక్షించాలంటున్న తెలంగాణ బీజేపి..
తెలంగాణలో మద్యం పై యుద్దం చేసేందుకు బీజేపి సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, సకల రుగ్మతలకు ఈ మధ్యమే కారణమని బీజేపి మహిళా మోర్చా ఘాటుగా విమర్శిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుండి మద్యం నియంత్రణ లేకుండా పోయిందని, మధ్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం విచ్చలవిడి అమ్మకాలను ప్రోత్సహిస్తోందని బీజేపి మహిళా నేతలు విమర్శిస్తున్నారు. మద్యం నిత్యం అందుబాటులో ఉండడంతో మహిళలపై అత్యాచారాలు కూడా పెరిగిపోతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.
అన్ని దుర్ఘటనలకు మద్యమే కారణం.. దశల వారీగా నియంత్రించాలంటున్న డీకే అరుణ..
రాష్ట్రంలో మద్యం సేవించడం వల్ల అనేక అఘాయిత్యాలు జరిగిపోతున్నా, జరగరాదని ఘోరాలకు ఎన్నో కుటుంబాలు సజీవ సాక్షాలుగా మిగిలి పోతున్నా ప్రభుత్వం పట్తించుకోవడం లేదని బీజేపి మహిళా నేత డీకే అరుణ విమర్శిస్తున్నారు. తెలంగాణ లోని అనేక జిల్లాల్లో తాగిన మైకంలో యువత సంఘవిద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. అదే మద్యం అందుబాటులో లేక పోతే యువత చెడుమార్గాలకు వెళ్లరని చెప్పుకొస్తున్నారు. మద్యానికి బానిసైన యువత ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక అరాచకానికి పాల్పడుతున్నారని అరుణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది.. ఘాటుగా విమర్శిస్తున్న బీజేపి మహిళా మోర్చా..
మద్యం పై ప్రభుత్వ నియంత్రణ లేకపోడం వల్లే అనేక హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని తెలంగాణ బీజేపి మహిళలు మండిపడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మానస, ఉమ్మది అదిలాబాద్ జిల్లాలో సమత, రంగారెడ్డి జిల్లాలో దిశ లాంటి విషాద సంఘటనలకు కూడా మద్యమే కారణమని వారు ఆరోపిస్తున్నారు. సమాజంలో జరుగుతున్న అనేక హృదయ విదారక ఘటనలకు కూడా నియంత్రణ లేని మద్యమే కారణమని బీజేపి మహిళలు ఆరోపిస్తున్నారు. అనేక కేసుల్లో మద్యం మత్తులో ఆఘాయిత్యాలకు పాల్పడినట్టు యువత ఒప్పుకుందని, ఇక నైనా మద్యం పైన నియంత్రణ లేకపోతే పరిస్థితి మరింత చేయి దాటే అవకాశం ఉందని తెలంగాణ బీజేపి మహిళలు స్పష్టం చేస్తున్నారు.
ఇందిరా పార్క్ వద్ద రెండు రోజుల దీక్ష.. మద్యాన్ని నిషేదించేంత వరకు పోరాటం ఆగదంటున్న డీకే అరుణ..
అంతే కాకుండా మద్య పానాన్ని దశల వారీగా నిషేదిస్తే రాష్ట్రంలో జరుగుతున్న అనేక అరాచకాలకు అడ్డుకట్ట వేయొచ్చని డీకే అరుణ అభివర్ణిస్తున్నారు. మద్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా చూస్తున్నందున నియంత్రించేందుకు వెనకాడుతుందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే ఇందిరా పార్క్ వద్ద రెండు రోజుల దీక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు స్పష్టం చేస్తున్నారు అరుణ. రేపు ఎల్లుండి, గురు, శుకృ వారాల్లో మద్యాన్ని దశల వారీగా నిషేదించాలని డిమాండ్ చేస్తూ రెండు రోజుల నిరసన కార్యక్రమానికి డికే అరుణ సన్నాహాలు చేస్తున్నారు. మరి డికే అరుణ డిమాండ్ పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.