ఆరుగురికి మంత్రులుగా ఛాన్స్.. కొడుకు, అల్లుడు ఈసారి.. ఇద్దరు మహిళలకు ఛాన్స్
హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. కొత్తగా ఆరుగురు ఎమ్మెల్యేలను మంత్రి పదవులు వరించాయి. సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన సబితా ఇంద్రారెడ్డితో పాటు కొత్తగా పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్కు ఛాన్స్ దక్కింది. ఆ మేరకు రాజ్ భవన్లో తెలంగాణ నూతన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వారితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. సరిగ్గా 4 గంటల 14 నిమిషాలకు తొలుత హరీశ్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కేటీఆర్ ప్రమాణం చేశారు.
ఈ ఆరుగురు మంత్రులకు తోడు పన్నెండు మంది పాత మంత్రుల కలయికతో తెలంగాణ ఫుల్ కేబినెట్ సిద్ధమైంది. తెలంగాణ మంత్రివర్గం పూర్తి స్థాయిలో కొలువుదీరడంతో ఆదివారం నాడు రాత్రి 7 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. ప్రగతి భవన్లో సమావేశమై 2019 - 20కి సంబంధించిన బడ్జెట్ను ఆమోదించనుంది. మార్చి నెలలోనే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.
రాజకీయ సమీకరణాలు, జిల్లాల ప్రాధాన్యత.. తొలిసారిగా ఇద్దరు మహిళలకు..!
రాజకీయ సమీకరణాలు, జిల్లాల ప్రాధాన్యత తదితర అంచనాలతో మరో ఆరుగురిని తెలంగాణ కేబినెట్లోకి తీసుకున్నారు సీఎం కేసీఆర్. మొదటి మంత్రివర్గ విస్తరణ జరిగి చాలా రోజులవుతుండటంతో.. కేబినెట్ విస్తరణ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. పాత ఎమ్మెల్యేలతో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. చివరకు అలాంటిదేమీ జరగలేదు. కేసీఆర్ అనుకున్నట్లుగానే, నచ్చినట్లుగానే తన టీమ్లోకి మరో ఆరుగురుని మంత్రులుగా తీసుకున్నారు. ఆ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరుగురు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కేసీఆర్ కేబినెట్లో తొలిసారిగా ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు దక్కడం విశేషం.
తొలుత హరీశ్ రావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలా వరుసగా కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్, ప్రమాణం చేశారు. అనంతరం కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.
కొడుకు, అల్లుడికి మంత్రి పదవులు
కేసీఆర్ కొడుకు కేటీఆర్.. మేనల్లుడు హరీశ్ రావుకు ఈసారి మంత్రివర్గంలో బెర్తులు దక్కాయి. మొదటి కేబినెట్ ఏర్పాటులో వీరిద్దరిని దూరం పెట్టారు. అదంతా కూడా కేసీఆర్ ప్లాన్ అనేవారు లేకపోలేదు. ఏది ఏమైనా కేబినెట్ విస్తరణలో మాత్రం మరోసారి ఆ ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. ఇక కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చే ముందే మంత్రి పదవి మాట ఇచ్చిన కేసీఆర్.. అన్న మాట ప్రకారం సబితా ఇంద్రారెడ్డికి కూడా మంత్రి పదవి కట్టబెట్టారు. ఇక కొత్తగా మంత్రివర్గంలోకి చేరుతున్న వారిలో గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్ ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న సత్యవతి రాథోడ్ ఎస్టీ సామాజిక చెందినవారు. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వంలో ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు దక్కాయి.
అప్పడు 12 మంది.. ఇప్పుడు ఆరుగురు.. ఫుల్ కేబినెట్ ఇదే
ముందస్తు అసెంబ్లీ ఎన్నికల తర్వాత 12 మందితో ఏర్పడ్డ మంత్రివర్గంలో సీఎంగా కేసీఆర్.. హోం మంత్రిగా మహమూద్ అలీ.. ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గుంతకండ్ల జగదీశ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, చామకూర మల్లారెడ్డి కొలువుదీరారు. తాజాగా మరో ఆరుగురికి మంత్రులుగా ఛాన్స్ ఇచ్చారు. కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్కు మంత్రి పదవులు దక్కాయి.
మొత్తానికి తెలంగాణ కేబినెట్ పూర్తిస్థాయిలో కొలువుదీరింది. బడ్జెట్ సమావేశాలకు ముందే ఫుల్ కేబినెట్ సిద్ధం చేయాలని కేసీఆర్ భావించారు. ఆ క్రమంలోనే అప్పుడు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అంటూ ప్రచారం జరిగినా.. చివరకు ఆదివారం నాడు ముహుర్తం ఫిక్స్ చేశారు. ఇక మంత్రివర్గం పూర్తి స్థాయిలో కొలువుదీరడంతో పాలనపై దృష్టి పెట్టనున్నారనే టాక్ వినిపిస్తోంది.