మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం.. ఈనెల 19 ఫిక్స్
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ విస్తరణకు ఫైనల్ గా ముహుర్తం ఖరారైంది. 66 రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంత్రివర్గ కూర్పుకు మార్గం సుగమమైంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా సుదీర్ఘ కాలంగా నాన్చుతూ వచ్చిన సీఎం కేసీఆర్ ఎట్టకేలకు కొత్త మంత్రులకు పచ్చజెండా ఊపారు. దాదాపు పదిమందికి పైగా ఆమాత్యులుగా అవకాశం దక్కనుంది. శుక్రవారం నాడు గవర్నర్ నరసింహన్ తో కేసీఆర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ మేరకు సీఎంవో కార్యాలయం నుంచి నోట్ విడుదల కావడంతో మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్ అయినట్లైంది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 22న ప్రారంభం కానుండటంతో అంతకుముందే మంత్రివర్గ విస్తరణ జరగాలని కేసీఆర్ భావించారు. దాంతో 19వ తేదీన కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ రోజు మాఘ శుద్ధ పౌర్ణమి కావడంతో మంచి రోజుగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ నెల 19వ తేదీన రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. శుక్రవారం మధ్యాహ్నం రాజ్ భవన్ లో గవర్నర్ శ్రీ ఇఎస్ఎల్. నరసింహన్ ను కలిసి తన నిర్ణయాన్ని తెలిపారు.
— Telangana CMO (@TelanganaCMO) February 15, 2019
తొలి మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చోటు దక్కనుందనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే 10 మందిని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. పాత ఎమ్మెల్యేలతో పాటు కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైనవారు సైతం మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎవరిని మంత్రి పదవులు వరిస్తాయన్నది సస్పెన్స్ గా మారింది.