సీఎం కేసీఆర్ పుట్టినరోజు.. వినూత్నంగా తూ.గో అభిమానుల విషెస్.. నేడు కోటి వృక్షార్చన...
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం(ఫిబ్రవరి 17) 67వ వడిలోకి అడుగుపెడుతున్నారు. ఉద్యమ నేతగా,ముఖ్యమంత్రిగా తెలంగాణపై ఆయనది చెరగని ముద్ర. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కేసీఆర్ అభిమానులు కూడా వినూత్న రీతిలో అభిమానాన్ని చాటుకున్నారు.జిల్లాలోని స్థానిక కడియం పల్ల వెంకన్న నర్సరీలో రంగురంగుల పూలు,పూల మొక్కలతో కేసీఆర్ ముఖచిత్రాన్ని ఆవిష్కరించారు.పూలతోనే 'హ్యాపీ బర్త్ డే సీఎం' అన్న అక్షరాలు రాసి శుభాకాంక్షలు తెలియజేశారు.గతంలోనూ ఆంధ్రప్రదేశ్లోని పలుచోట్ల కేసీఆర్ అభిమానులు ఆయన పుట్టినరోజు వేడుకలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
బల్కంపేట అమ్మవారికి బంగారు చీర...
కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్లోని బల్కంపేట అమ్మవారికి ఎమ్మెల్సీ కవిత,మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బంగారు చీరను సమర్పించనున్నారు. దాతల సహకారంతో రెండున్నర కిలోల బంగారంతో ఈ చీరను తయారు చేయించడం విశేషం. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం, తొమ్మిది గంటలకు మృత్యుంజయ హోమం, ఆయుష్షు హోమం నిర్వహించనున్నారు. అనంతరం అన్నప్రసాదం పంపిణీ చేయనున్నారు. నగరంలోని జ్జయినీ మహంకాళి, సికింద్రాబాద్ గణేష్ ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
కోటి వృక్షార్చన...
కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కోటి వృక్షార్చన కార్యక్రమం చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రతీ ఒక్కరూ మూడేసి మొక్కలను నాటాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉదయం 10గంటల నుంచి 11గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ప్రతి పంచాయతీకి వెయ్యి మొక్కలు నాటాలని నిర్దేశించుకున్నారు. ఇప్పటికే మొక్కలు అన్ని గ్రామాలు,పట్టణాలకు మొక్కలను సరఫరా చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సింగరేణి యాజమాన్యం, సబ్బండ వర్గాలు ఇందులో పాల్గొని కేసీఆర్ పుట్టినరోజున హరిత కానుక ఇవ్వనున్నారు.
రక్తదాన శిబిరాలు,జలవిహార్లో వేడుకలు...
కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ యూత్ వింగ్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం నిర్వహిస్తున్నారు. మంత్రి తలసాని ఆధ్వర్యంలో జలవిహార్లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ బాల్యం నుంచి ముఖ్యమంత్రి వరకూ సాగిన ఆయన ప్రస్థానాన్ని 30నిమిషాల డాక్యుమెంటరీ ద్వారా ప్రదర్శించనున్నారు. బుధవారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 3లక్షల మొక్కలు నాటనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కేసీఆర్ స్వగ్రామం సిద్దిపేట జిల్లాలోని చింతమడకలో గ్రామస్తులు రుద్ర హోమాన్ని నిర్వహించనున్నారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ 21 రోజుల పాటు ఈ హోమం నిర్వహించనున్నారు.