కేసీఆర్ మరోసారి ఫెడరల్ ఫ్రంట్ అడుగులు: హైదరాబాద్లో భారీ సభ: పలు పార్టీల నేతలకు ఆహ్వానం!
తెలంగాణ ముఖ్యమంత్రి.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఫెడరల్ ఫ్రంట్ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో నెలకొన్ని రాజకీయ పరిస్థితుల్లో అందరి దృష్టి ఆకర్షించే ప్రయత్నాల ను ప్రారంభించారు. జాతీయ రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించేందుకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగా.. పౌరసత్వ సవరణ చట్టంపై యావద్దేశం నిరసనలతో వేడెక్కిన రాజకీయాలను సానుకూలంగా మలచుకొనేందుకు టీఆర్ఎస్ అధినేత సిద్ధమయ్యారు. దీంతో..జనవరి 30వ తేదీన మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లో గాంధీ కావాలా.. గాడ్సే కావాలా నినాదంతో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఈ సభలకు దేశంలోని ప్రముఖ జాతీయ..ప్రాంతీయ పార్టీల నేతలను ఆహ్వానించాలని నిర్ణయించారు.
వెనక్కి తగ్గని సీఎం కేసీఆర్: సమీక్షకు పిలుపు..రద్దు: ఇక..చర్చలు లేనట్టేనా..!
హైదరాబాద్ సభ ద్వారా..
లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ నిర్మిస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ తర్వాత వెలువడిన లోక్సభ ఫలితాల్లో బీజేపీ భారీ విజయాలు సాధించడంతో సానుకూల వాతావరణం లేదని గ్రహించి, మౌనం వహించారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి ఎవరూ ఊహించని విధంగా నాలుగు సీట్లు దక్కాయి. ఆ తర్వాత బీజేపీ రాష్ట్రంలో కార్యకలాపాలను ఉద్ధృతం చేసింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఇన్నాళ్లకు కేసీఆర్కు జాతీయ రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించేందుకు అవకాశం దక్కింది. జాతీయ స్థాయిలో తాను జరిపే పోరాటంతో లౌకిక వాదులు, ముస్లిములు వచ్చే ఎన్నికల్లో తనకు గట్టి అండగా నిలబడతారని కేసీఆర్ భావిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై యావద్దేశం నిరసనలతో వేడెక్కిన రాజకీయాలను సానుకూలంగా మలచుకొనేందుకు టీఆర్ఎస్ అధినేత సిద్ధమయ్యారు. అందులో భాగంగానే జనవరి 30వ తేదీన మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లో గాంధీ కావాలా.. గాడ్సే కావాలా ని అనే నాదంతో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు.
జాతీయ..ప్రాంతీయ నేతలకు ఆహ్వానం..
దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన సీఏఏ.. ఎన్ఆర్సీ.. ఎన్సీఆర్లను వ్యతిరేకిస్తూ కేసీఆర్ జనవరి 30న హైదరాబాద్లో తలపెట్టిన సభకు జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇందు కోసం కొత్త నినాదానికి రూప కల్పన చేసారు. మహాత్మాగాంధీ కావాలా.. గాడ్సే కావాలా అనే నినాదంతో నిరసన బహిరంగసభను సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.ముస్లిం మత నాయకులు.. ప్రతినిధులను దేశం నలు మూలల నుంచి ఆహ్వానించే బాధ్యతను అసదుద్దీన్ ఒవైసీకి అప్పగించారు. ముఖ్యమంత్రితో ఎంఐఎం సమావేశమైన సమయంలో ఈ సభపైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ నిర్వహించే ఈ సభకు సోనియా.. మమత.. నితీశ్.. పినరై విజయన్.. హేమంత్ చౌదరిలను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. దక్షిణాదిన బీజేపి వ్యతిరేక నేతగా..జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా..అన్ని పార్టీలను సమన్వయ పర్చుకుంటూ ముందుకెళ్లే వ్యూహం కేసీఆర్ అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఫెడరల్ ఫ్రంట్ కు ఇక్కడి నుండే..
హైదరాబాద్ లో నిర్వహించే ఈ సభ ద్వారా తన కలగా మిగిలిన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును సాకారం చేసేందుకు కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తులు వేస్తున్నారు. తాజగా.. అసద్ నేతృత్వంలో ముస్లిం సంస్థల ప్రతినిధులు కేసీఆర్ను కలిసారు. ఈ నెల 27న అసద్ నిజామాబాద్ లో మరోసారి మహబూబ్ నగర్ తరహాలో సభ నిర్వహిస్తున్నారు. డిసెంబరు 29న బిహార్లోని కిషన్గంజ్లో జరిగే సభకు రావాలని అసద్ సీఎంను కోరినట్లు తెలుస్తోంది. ఇక, జనవరి 30న హైదరాబాద్ లో నిర్వహించే సభకు పలువురు జాతీయ నేతలతో పాటుగా..పలు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నేతలను సైతం ఆహ్వానించటం ద్వారా తన సత్తా చాటాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ సభ సక్సెస్ అయితే..దీని ద్వారా తిరిగి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కేసీఆర్ వేగంగా అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. అయితే, కేసీఆర్ ఆలోచన ఎంత వరకు కార్య రూపం దాలుస్తుందనేది సభ నిర్వహణ..హాజరయ్యే నేతలు..వారి నుండి వచ్చే మద్దతు మీద ఆధార పడనుంది.