కేసీఆర్ పక్కా దేశ ద్రోహి... ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి... బండి సంజయ్ సంచలన ఆరోపణలు...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ పక్కా దేశ ద్రోహి అని... ఆయనకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఎంఐఎంతో కుమ్మక్కైనందువల్ల ఆయనకు ఉగ్రవాద సంబంధాలు ఉంటాయని ఆరోపించారు. నిఘా సంస్థలు కేసీఆర్ కదలికలను డేగ కళ్లతో కనిపెడుతుండాలన్నారు. దేశంలో ఉన్న 30 కోట్ల ముస్లింల గురించి మాట్లాడుతున్న కేసీఆర్.. తెలంగాణ హిందువుల గురించి ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. వరద సాయాన్ని ఆపేందుకు ఈసీకి తాను లేఖ రాసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని మరోసారి సంజయ్ ఖండించారు. దీనిపై చార్మినార్ పరిధిలోని భాగ్యలక్ష్మి ఆలయం వద్ద చర్చకు రావాలని సవాల్ విసిరారు.
కేసీఆర్ నిజమైన హిందువైతే.. మగాడైతే... ; బండి సంజయ్
ప్లాన్ ప్రకారం లెటర్ రాయించి.. తన సంతకాన్ని ఫోర్జరీ చేయించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రజలెవరూ ఆ దుష్ప్రచారాన్ని నమ్మేందుకు సిద్దంగా లేరన్నారు. భాగ్యలక్ష్మి ఆలయ సాక్షిగా తాను లేఖ రాయలేదని ప్రమాణం చేసేందుకు సిద్దంగా ఉన్నానన్నారు. గురువారం(నవంబర్ 20) మధ్యాహ్నం 12గంటలకు కేసీఆర్ అక్కడికి వచ్చి తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. కేసీఆర్ మూర్ఖత్వపు పాలనకు సమాధి కట్టేందుకు రేపటి ముహూర్తమే నాంది అన్నారు. కేసీఆర్ నిజంగా హిందువైతే... మగాడైతే... సవాల్ స్వీకరించాలన్నారు. బిడ్డా కేసీఆర్ చుక్కలు చూపిస్తామంటూ హెచ్చరించారు.
బీజేపీని గెలిపిస్తే రూ.25వేలు పరిహారం...
అసలు హైదరాబాద్ నరంలో ఏ డివిజన్లో ఎవరికెంత వరద సాయం ఇచ్చారో లిస్టు బయటపెట్టాలన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ఇంటికి రూ.25వేలు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
గ్రేటర్ పరిధిలో ఇష్టానుసారం చలాన్లు వసూలు చేస్తున్నారని.. బీజేపీకి మేయర్ పీఠం దక్కితే... ఆ చలాన్లు జీహెచ్ఎంసీయే చల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. డిస్కంలకు రూ.20వేల కోట్లు బకాయిలు చెల్లించలేదని.. రాష్ట్రంలో కరెంట్ ఉంటుందో పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఇష్టానుసారం హైదరాబాద్లో చలాన్లు వసూలు చేస్తున్నారని... బీజేపీని గెలిపిస్తే ఆ చలాన్లు జీహెచ్ఎంసీయే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. బీజేపీ గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తుందన్నారు.
ప్రధానిని అవమానిస్తారా...
ప్రధాని మోదీని,సరిహద్దులో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సైనికులను అవమానపరిచేలా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా సైన్యం చేతిలో భారత్ చతికిలపడిందని మాట్లాడటం శోచనీయమన్నారు. అసలు ముఖ్యమంత్రి ఏ దేశానికి భక్తుడో అర్థం కావట్లేదన్నారు. బిహార్ ఎన్నికల్లో ఎంఐఎం ఐదు స్థానాలకు గెలిచేందుకు సీఎం ఆర్థిక సాయం చేశారని ఆరోపించారు. దేశాన్ని కూడా ఎంఐఎంకు అప్పగించే కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. సంక్షేమ,అభివృద్ది కోసం రాష్ట్రం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో... కేంద్రం ఎంత ఖర్చు చేస్తుందో తేల్చేందుకు చర్చకు సిద్దమని ప్రకటించారు.