ఢిల్లీకి తెలంగాణ సీఎం.. మోడీతో భేటీ కానున్న కేసీఆర్.. ఇవేనా కీలకాంశాలు..!
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధానికి బయలుదేరారు. శుక్రవారం (04.10.2019) నాడు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో అపాయింట్మెంట్ ఉంది. వీరిద్ధరి భేటీలో కీలక అంశాలు చర్చకొచ్చే అవకాశముంది.
ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితో జరగనున్న భేటీలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధుల్లో రాష్ట్ర వాటా పెంచాలని కోరనున్నట్లు సమాచారం. అలాగే తెలంగాణలోని ఏదేని ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేలా చర్యలు తీసుకోవాలని మోడీ దృష్టికి తీసుకెళతారని తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే విషయంలో ఇప్పటికే పలుమార్లు మోడీకి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ కొత్త లిక్కర్ పాలసీ.. నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజు డబుల్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువుల పూడిక తీత కార్యక్రమం మిషన్ కాకతీయ ఇప్పటికే నీతి ఆయోగ్ ప్రశంసలు పొందింది. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలో భూగర్భ జలాలు పెరుగుతున్న విషయం గుర్తించింది. అయితే ఇంత మంచి కార్యక్రమానికి సంబంధించి కేంద్రం తన వంతుగా సాయం అందించాలని మోడీకి పలు సందర్భాల్లో విజ్ఞప్తి చేశారు కేసీఆర్. అలాగే ఇంటింటికీ తాగు నీరు అందించే మిషన్ భగీరథ పథకాన్ని సాక్షాత్తూ మోడీ ప్రారంభించారు. అదలావుంటే ఈ పథకానికి సాయం అందించాల్సింగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది నీతి ఆయోగ్ బృందం. అయితే తాజా పర్యటనలో కేసీఆర్ మరోసారి ఈ రెండు పథకాలకు సంబంధించి కేంద్రం సాయం కోరనున్నట్లు తెలుస్తోంది.