తెలంగాణ ఇలాకాపై బీజేపీ, కాంగ్రెస్ కన్ను.. మరి టీఆర్ఎస్ పరిస్థితి.. ఇంతకు 2023 ఎవరిది?
హైదరాబాద్ : తెలంగాణ పోరుగడ్డపై గులాబీ వికసించింది. ఉద్యమ నేపథ్యంతో రాటుదేలి టీఆర్ఎస్ రాజకీయ శక్తిగా అవతరించింది. 2014, 2018 ఎన్నికల్లో విజయదుందుభి మోగించి కారుకు తిరుగులేదని నిరూపించుకుంది. అయితే లోక్సభ ఎన్నికలు మిగిల్చిన ఎదురుదెబ్బ గులాబీ వనం బలాన్ని దెబ్బతీసిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే ప్రత్యామ్నాయ పార్టీల ఊసు లేకుండా టీఆర్ఎస్ను బలోపేతం చేయాలనే ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆలోచనలకు గండికొట్టేలా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు పన్నుతున్నాయి. ఆ క్రమంలో 2023లో రాజ్యాధికారం మాదంటే మాదంటూ ఆ పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తుండటం చర్చానీయాంశంగా మారింది.
KCR కేంద్రంలో చక్రం తిప్పలేరా.. హరీష్ రావుకు మంత్రి పదవి..! KTR కు ఆ పోస్ట్ లేనట్లేనా?
టీఆర్ఎస్ను ఢీకొట్టేలా..!
తెలంగాణ సాధనతో రాష్ట్రంలో బలమైన శక్తిగా మారిన టీఆర్ఎస్ను ఢీకొట్టేందుకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్తో ఆ రెండు పార్టీల నేతలు 2023లో రాజ్యాధికారం మాదంటే మాదంటూ తెగ హడావిడి చేస్తున్నారు. 4 స్థానాల్లో గెలిచి బలం పుంజుకున్నామని భావిస్తున్న బీజేపీ నేతలతో పాటు.. టీఆర్ఎస్ను ఎదిరించేవారు ఉండాలనే ఉద్దేశంతో ప్రజలు తమకు 3 స్థానాలు కట్టబెట్టారనేది కాంగ్రెస్ లీడర్ల వాదన.
లోక్సభ ఫలితాలతో జోష్.. మాదంటే మాదే అధికారమంటూ..!
ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ స్థానాలు బీజేపీ ఖాతాలో పడటంతో ఆ పార్టీశ్రేణుల్లో ఎక్కడా లేని ఉత్సాహం కనిపిస్తోంది. అయితే బీజేపీ బలం పుంజుకుందని భావిస్తున్న ఆ పార్టీ నేతలు 2023లో తమదే రాజ్యాధికారం అంటున్నారు. ఈ నాలుగున్నర సంవత్సరాలలో పార్టీని బలోపేతం చేసి అధికారం దిశగా అడుగులు వేస్తామంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. 2023లో బీజేపీకి విజయం తథ్యమని.. ఎట్టిపరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కారు పల్టీలు కొడుతోందని.. కమలం బలం పుంజుకున్నదని చెప్పడానికి ఉత్తర తెలంగాణలో మూడు స్థానాలు కైవసం చేసుకోవడమే దానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. సారు..కారు.. పదహారు అంటూ టీఆర్ఎస్ నేతలు తెగ హడావిడి చేసినప్పటికీ.. సారూ మీతో బేజారు అంటూ ప్రజలు తిప్పికొట్టారని వంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కారు పంక్చర్ కావడంతో టీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయమని చెప్పుకొచ్చారు. 2023లో తెలంగాణ ఇలాకాలో బీజేపీ జెండా ఎగురుతుందని స్పష్టం చేస్తున్నారు.
2023 ఎన్నికలకు ఇప్పటినుంచే.. టీఆర్ఎస్కు ధీటుగా..!
లోక్సభ ఫలితాల్లో టీఆర్ఎస్ మెజార్టీ తగ్గడం కాంగ్రెస్ నేతలకు అస్త్రం దొరికినట్లైంది. 16 స్థానాల్లో గెలుస్తామంటూ గొప్పగా చెప్పిన టీఆర్ఎస్ నేతలు చివరకు 9 స్థానాలకే పరిమితమయ్యారు. సారు..కారు..పదహారు అంటూ ప్రచారం హోరెత్తించినప్పటికీ.. ఫలితాలు వచ్చే నాటికి సీన్ రివర్సయింది. దాంతో టీఆర్ఎస్ను ఎక్కడికక్కడ ఏకిపారేస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. అంతేకాదు 2023 నాటికి పార్టీ పునర్ వైభవం సాధిస్తుందని ఆశిస్తున్నారు.
టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం గులాబీ గూటికి చేరుతున్న క్రమంలో.. ఆ పార్టీ సీనియర్లు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. గత నెల మొదటివారంలో వి.హనుమంతరావు రెండేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవాలని పెద్దమ్మతల్లికి మొక్కుకున్నానంటూ వ్యాఖ్యానించారు. వీహెచ్ అలా మాట్లాడిన మరుసటి రోజే.. ఆర్నెళ్లల్లో కేసీఆర్ సర్కార్ కూలిపోవడం ఖాయమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పడం హాట్ టాపికయింది. రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ రానురాను ప్రాభవం కోల్పోతుందని అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో ఇతర పార్టీలతో పోల్చి చూసినట్లయితే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు తగినశాస్తి జరిగిందని.. ఎప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేది కాంగ్రెస్ పార్టీయేనని చెబుతున్నారు.
జూన్ నెల వచ్చిందయ్యో.. తల్లిదండ్రులకు టెన్షన్ తెచ్చిందయ్యో..!
ట్రయాంగిల్ పొలిటికల్ స్టోరీ.. 2023లో అధికారం ఎవరిది?
4 స్థానాల్లో గెలిచిన బీజేపీ, 3 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ తెలంగాణపై దృష్టి సారించాయి. టీఆర్ఎస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ అగ్ర నాయకత్వం కూడా తెలంగాణ వైపు దృష్టి సారించింది. ఉత్తర తెలంగాణలో ప్రారంభమైన ఏ ఉద్యమమైనా సక్సెస్ అయిందని గుర్తు చేస్తున్నారు కమలనాథులు. ఆ క్రమంలో ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లోక్ సభ స్థానాలు కైవసం చేసుకోవడం ఆ పార్టీకి బలం చేకూరింది.
మొత్తానికి ఏకపక్షంగా దూకుడు కొనసాగిస్తున్న టీఆర్ఎస్ పరిస్థితి 2023 నాటికి ఏవిధంగా ఉండబోతోందనే చర్చ జరుగుతోంది. మొత్తానికి మరోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ నేతలు ఆశిస్తుంటే.. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకుని 2023లో అధికారం మాదంటే మాదంటున్నారు బీజేపీ, కాంగ్రెస్ నేతలు. మొత్తానికి విజయగాథను రిపీట్ చేస్తూ టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందా.. లేదంటే రాష్ట్రంలో త్రిముఖ పోటీ అనివార్యం కానుందా అనేది వేచి చూడాల్సిందే.