తెలంగాణ కాంగ్రెస్ సమూల ప్రక్షాళన..! పీసీసీ రేసులో రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి..!!
హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కి కొత్త సారథి రానున్నాడా? జూలై మొదటి వారంలో నూతన అధ్యక్షుడిని ప్రకటించేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తోందా? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి పదవీకాలం ముగిసినా.. వరుస ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ ఆయననే కొనసాగిస్తోంది. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వైఫల్యం చెందిన నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల పీసీసీలను మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోనూ పీసీసీ మార్పు కోసం కసరత్తు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అందుకోసం అందరిని కలుపుకుపోయి, ప్రజాకర్షణ కలిగిన నేత కోసం కాంగ్రెస్ అదిష్టానం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మారుతున్న కాలం ప్రకారం యూత్ ని ఎక్కువ ఆకర్షించే నేత ఐతే తెలంగాణలో ప్రభావం చూపించగలరనే నమ్మకాన్ని కాంగ్రెస్ అదిష్టానం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
కొత్త పీసీసీ చీఫ్ కోసం అధిష్ఠానం పెద్దల పరిశీలనలో మాజీమంత్రి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి.. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి పేర్లు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందరినీ కలుపుకొని పోయే తత్వం ఉండటం జీవన్రెడ్డికి సానుకూలాంశం. అదే సమయంలో.. రేవంత్రెడ్డితో పోలిస్తే.. ఆయన ఆ స్థాయి ప్రజాకర్షక నేత కాదనే వాదనలు ఉన్నాయి. ఇక రేవంత్రెడ్డి విషయానికి వస్తే.. సీఎం చంద్రశేఖర్ రావు ను ఢీకొట్టగల సమర్థత, ప్రజాకర్షక నేతగా నిరూపించకోవడం కలిసివచ్చే అంశాలుగా ఉన్నాయి. అయితే.. ఆయన సొంత ఇమేజీనే చూసుకుంటారని, నేతలందరినీ కలుపుకొనిపోరనే అపవాదు సొంతపార్టీ నేతల నుంచే వ్యక్తమవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాసంకల్ప యాత్రను చేపట్టి.. ఏపీ మొత్తం తిరిగిన వైఎస్ జగన్కు.. అది ఎన్నికల్లో బాగా ఉపయోగపడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే ఆలోచనను అధిష్ఠానం ముందు రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వేర్వేరుగా ఉంచినట్లు సమాచారం. అదిష్టానం ఆమోదం తెలిపితే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసేందకు రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.