యురేనియం తవ్వకాలపై కాంగ్రెస్ పోరాటం.. వీహెచ్ ఛైర్మన్గా కమిటీ
హైదరాబాద్ : యురేనియం తవ్వకాలపై కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. నల్లమల అటవీ ప్రాంత పరిరక్షణ ధ్యేయంగా ముందుకెళుతోంది. ఆ క్రమంలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించారు పార్టీ పెద్దలు. రాజ్యసభ మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ లీడర్ వి.హనుమంత రావును ఛైర్మన్గా నియమిస్తూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
యురేనియం తవ్వకాలపై టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ అస్త్ర శస్త్రాలు ప్రయోగిస్తోంది. ఆ క్రమంలో ఇదివరకే క్షేత్ర స్థాయిలో తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తోంది. తాజాగా 16 మంది సభ్యులతో కూడిన కమిటీ వేస్తూ వీహెచ్ ను ఛైర్మన్గా ప్రకటించారు.
టీఆర్ఎస్ అసంతృప్త నేతల కాళ్లు పట్టుకుంటున్నారు.. కోమటిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్..!
నల్లమల అటవీ ప్రాంత పరిరక్షణ, యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఈ కమిటీ పోరాడనుంది. ఈ నెల 16వ తేదీన యురేనియం వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు వీహెచ్. యురేనియం తవ్వకాలపై పోరాటం చేస్తూ క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి వెళతామన్నారు. న్యూ క్లియర్ పవర్ కచ్చితంగా అవసరమనుకున్న పక్షంలో యురేనియం దిగుమతి చేసుకోవచ్చని.. కానీ తెలంగాణలో యురేనియం నిక్షేపాల కోసం అడవులను నాశనం చేస్తే తిరిగి వాటిని ఎలా తెచ్చుకోగలమని ప్రశ్నించారు. అడవులు పోతే నీళ్లు కూడా దొరకడం కష్టమేనని చెప్పుకొచ్చారు. కృష్ణా పరివాహక ప్రాంతం విషతుల్యం కాకుండా కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు వీహెచ్.