విజయశాంతి ఇంటికి మణికం ఠాగూర్ -బీజేపీలో చేరొద్దని బుజ్జగింపు..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీలతో పోరాడాలని నిర్ణయించుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత విజయశాంతి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ గా కొనసాగుతోన్న ఆమె.. సొంత నేతల చేతిలో అవమానాలు ఎదుర్కొన్నారని, దీంతో మనస్తాపం చెంది, కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరబోతున్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో..
విజయశాంతిని బుజ్జగించి, ఆమె సమస్యలు వినేందుకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మణికం ఠాగూర్ రంగంలోకి దిగారు. ఠాగూర్ బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని విజయశాంతి ఇంటికి వెళ్లారు. సుధీర్ఘంగా ఆమెతో చర్చించినట్లు సమాచారం. పలు విషయాలను ఠాగూర్ దృష్టికి తీసుకెళ్లిన ఆమె.. కాంగ్రెస్ పార్టీలో తనకు జరిగిన అవమానాన్ని వివరించినట్లు తెలిసింది.
ప్రచార సారధ్య బాధ్యతలు ఇవ్వడమే కాకుండా, తెలంగాణలో విస్తృత పర్యటనలకు కూడా రాహుల్ గాంధీ గ్రీన్సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా.. స్థానిక నేతలను తనను అడ్డుకున్నారని, ఏ పని చేద్దామనుకుంటున్నా ఆటంకాలు, అడ్డంకులు సృష్టిస్తున్నారని విజయశాంతి.. ఠాగూర్ కు వివరించినట్లు సమాచారం. ఆమె చెప్పిన విషయాలు సావధానంగా విన్న ఇంచార్జి.. వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా,
విజయశాంతి పార్టీ మారబోరని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా ఆ పార్టీ నేతలు ఇదివరకే స్పష్టం చేసినప్పటికీ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మంగళవారం మీడియా ముఖంగా విజయశాంతిని పొగడ్తలతో ముంచెత్తడం ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. విజయశాంతి ప్రజాదరణ ఉన్న నాయకురాలని, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారని, అయితే, రాష్ట్రం వచ్చిన తర్వాత పార్టీలు ఆమెను నిర్లక్ష్యం చేశాయని సంజయ్ అన్నారు.