తెలంగాణ కౌన్సిల్ లో కాంగ్రెస్ ఖల్లాస్..! TRS లో విలీనానికి పిటిషన్
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర వైఫల్యం తర్వాత మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్, ప్రభాకర్, దామోదర్ రెడ్డి మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ ను టీఆర్ఎస్ లో విలీనం చేయాలని కోరుతూ లేఖ అందించడం చర్చానీయాంశంగా మారింది. ఇప్పటికే ప్రభాకర్రావు, దామోదర్రెడ్డి టీఆర్ఎస్ లో చేరిపోయారు. త్వరలోనే ఆకుల లలిత, సంతోష్ కుమార్ గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు.
ప్రతిపక్ష హోదా మిస్సయినట్లేనా?
కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఇచ్చిన షాక్ తో మండలిలో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగలనుంది. ఒకవేళ కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేస్తే.. ఆ పార్టీ బలం ఇద్దరు సభ్యులకే పరిమితం కానుంది. దీంతో మండలిలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా పోయినట్లే. శాసనమండలిలో అపొజిషన్ స్టేటస్ కావాలంటే మినిమమ్ నలుగురు సభ్యుల బలం ఉండాలి. ఇప్పటివరకు ఏడుగురు సభ్యుల బలమున్న కాంగ్రెస్ కు.. మొన్నటి ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ సంఖ్య ఆరుకు పడిపోయింది. అందులో ఇప్పుడు నలుగురు గులాబీ చెంతకు చేరారు. ఇక మిగిలింది షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి మాత్రమే. ఒకవేళ ఈ నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీల వ్యూహానికి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుంటే.. మండలిలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా మిస్సయినట్లే.
ప్రజలంతా అటే.. అందుకే మేము కూడా..!
ప్రజలంతా టీఆర్ఎస్ వైపు ఉన్నారు కాబట్టే మేము కూడా అదే బాట పట్టామంటున్నారు ఈ నలుగురు ఎమ్మెల్సీలు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీలుగా తాము గెలిచినప్పటికీ.. ప్రజాపక్షం వహించడానికే టీఆర్ఎస్ మండలి పక్షంలో తమను విలీనం చేయాలని కౌన్సిల్ ఛైర్మన్ ను కోరినట్లు చెప్పారు. టీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అనూహ్య స్పందన లభించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవడం మూలంగానే కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలిందని వ్యాఖ్యానించారు.
కారు వైపు విపక్ష నేతల చూపు.. జోరుగా ఆపరేషన్ ఆకర్ష్.. కేసీఆర్ "వంద" నిజం కానుందా?
ప్రజాస్వామ్యం ఖూనీ.. ఆ లేఖకు విలువలేదు..!
శాసనమండలిలో కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని కోరుతూ ఆ నలుగురు ఇచ్చిన లేఖకు విలువలేదన్నారు టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ. అలా చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుందన్నారు. పెద్దల సభ గౌరవం కాపాడాలని కోరుతూ మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ను కలిశారు. కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, ప్రభాకర్ రావు పార్టీ ఫిరాయించడంతో వారిపై అనర్హత వేటు వేయాలని గతంలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. పార్టీ అధ్యక్షుడి పర్మిషన్ లేకుండా ఆకుల లలిత, సంతోష్ కుమార్ సీఎల్పీ సమావేశం నిర్వహించడమేంటని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన వారితో సమావేశం చెల్లుబాటు కాదని.. వారు చేసిన తీర్మానానికి విలువ లేదని అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న తమరు ఈ విషయాన్ని సీరియస్ గా చూడాలని స్వామిగౌడ్ ను కోరారు. అప్పట్లో తామిచ్చిన ఫిర్యాదు మేరకు పార్టీ ఫిరాయించిన దామోదర్ రెడ్డి, ప్రభాకర్ రావుపై అనర్హత వేటు వేయాలని కోరారు.