ముఖ్యమంత్రిపై ప్రధానికి ఫిర్యాదు.. నేరుగా కేంద్రం జోక్యానికి ఎంపీ వినతి..
తెలుగురాష్ట్రాల్లో పార్టీల ఫిరాయింపులు జోరుగా సాగుతున్నవేళ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సడెన్ గా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీలోనే ఉన్న ఎంపీ కోమటిరెడ్డి.. మంగళవారం పీఎంవోకు వెళ్లి మోదీతో దాదాపు అరగంటసేపు ముచ్చటించారు. అనంతరం మీడియా ముందుకొచ్చిన ఆయన.. సమావేశం వివరాలను వెల్లడించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబీకులు తెలంగాణను ఏ విధంగా దోచుకుంటున్నది, టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఎలా నాశనమైందనే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్ళానని ఎంపీ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని అభివృద్ధిని టీఆర్ఎస్ నిర్లక్ష్యం చేస్తోన్న దరిమిలా.. ఈ విషయంలో కేంద్రమే నేరుగా చొరవతీసుకుని, ప్రజలకు మేలు చేయాలని మోదీని కోరినట్లు కోమటిరెడ్డి చెప్పారు. కేసీఆర్ హయాంలో సంపన్న తెలంగాణ రూ.4లక్షల కోట్ల అప్పుల కుప్పగా మారినవైనం, సీఎం కుటుంబీకుల అక్రమాలకు సంబంధించిన వ్యవహారాలు ప్రధాని దృష్టిలో ఉన్నాయని ఎంపీ పేర్కొన్నారు.
కీలకమైన ఫార్మాసిటీపైనా ప్రధానితో మాట్లాడానని, హైదరాబాద్ శివారులో ఏర్పాటుచేయతలపెట్టిన భారీ ఫార్మాసిటీకి తాను వ్యతిరేకం కానప్పటికీ.. కాలుష్య కారణాల రీత్యా అభ్యంతరాలు వ్యక్తం చేశానని గుర్తుచేశారు. హైదరాబాద్ లో కొత్త గా ఏర్పాటుచేయనున్న ఫార్మాసిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తామని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే మొత్తం ప్రాజెక్టునే ఉపసంహరించుకుంటామని, దీనిపై ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేయొద్దని మంత్రి కేటీఆర్ ఇదివరకే అసెంబ్లీలో ప్రకటించారు. అయితే, కొత్త ఫార్మాసిటీని హైదరాబాద్ శివారు నుంచి వేరొక ప్రాంతానికి తరలించే విషయమై ప్రధానిని రిక్వెస్ట్ చేసినట్లు ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు.
Recommended Video
గ్రామాలు, సాగూభూమి లేని చోట ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, సిటీ శివారులో పెడితే జనం కాలుష్యం బారిన పడే ప్రమాదం ఉందని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదు కాబట్టే, ప్రధాని దృష్టికి తీసుకొచ్చానని ఎంపీ వివరించారు. ఫార్మాసిటీ వ్యవహారంతోపాటు హైదరాబాద్ ఓటర్ రింగ్ రోడ్డు నుంచి కొత్తగూడెం వరకు జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని, మూసీ మోడ్రనైజేషన్ కు కేంద్రం నిధులు ఇవ్వాలని కోరినట్లు కోమటిరెడ్డి తెలిపారు. అభివృద్ధి అంశాలు తప్ప రాజకీయ విషయాలేవీ ప్రధానితో చర్చించలేదని స్పష్టం చేశారు.