ట్రంప్ కోసం తెలంగాణ వంటకాలు..! మూడు ఐటెమ్స్ తో కిట్ సిద్దం చేయిస్తున్న కేసీఆర్..!!
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏది చేసినా కాస్త వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్త పడుతుంటారు. అందరూ చేసిందే తాను చేస్తే అందులో కిక్కేముంది అనే దిశగా అడుగులు వేస్తారు సీఎం చంద్రశేఖర్ రావు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినప్పటినుండి, తెలంగాణ సీఎంగా బాద్యతలు నిర్వర్తించే క్రమంలో ఎంతో వైవిధ్యాన్ని చూపించారు కేసీఆర్.అంతే కాకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక తెలంగాణ పగ్గాలు చేపట్టిన కేసీఆర్ ఎంతో డిఫరెంట్గా వ్యవహరిస్తూ ప్రజానీకం చేత ప్రశంసలందుకుంటున్నారు .
ఇండియా పర్యటనకు డోనాల్డ్ ట్రంప్.. విందులో పాల్గొనాల్సిందిగా కేసీఆర్ కు ఆహ్వానం..
సంక్షేమ పథకాల రూపకల్పన, తెలంగాణలో జిల్లాల పెంపు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, కాళేశ్వరం వంటి బృహత్తర కార్యక్రమాలకు చంద్రశేఖర్ రావు వినూత్నంగా రూపకల్పన చేశారు. అంతే కాకుండా ప్రతి దసరా సందర్భంగా తెలంగాణ ఆడ పడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం కూడా ప్రజల ఆదరణ పొందింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ రైతాంగం చేత శభాష్ అనిపించుకున్నారు కేసీఆర్.
రాష్ట్రపతి భవన్ లో విందు.. తెలంగాణ వంటకాలు రుచిచూపించనున్న సీఎం కేసీఆర్..
తర్వాత ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ కూడా పలు వినూత్న కార్యకలాపాలకు వేదికయ్యింది. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మొదటి సారి ప్రగతి భవన్ వెళ్లి నప్పుడు చంద్రశేఖర్ రావు వినూత్న రీతిలో విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రగతి భవన్ వెళ్లినప్పుడు కూడా పసందైన తెలంగాణ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. దీంతో తెలంగాణ వంటకాల రుచులను, గొప్ప తనాన్ని ప్రజలకు మరో సారి గుర్తు చేశారు సీఎం చంద్రశేఖర్ రావు.
రుచికరమైప వంటకాలతో కేసీఆర్.. ట్రంప్ మెప్పు పొందడం గ్యారెంటీ..
తాజాగా తెలంగాణ వంటకాలకు మరో సారి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు సీఎం చంద్రశేఖర్ రావు. ఐతే ఈసారి తెలంగాణ వంటకాలను రుచి చూసేది మాత్రం సామాన్యమైన వ్యక్తి కాదు. అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అవును.. నిజమే.. మీరు చదువుతున్నది ముమ్మాటికి నిజమే.. తెలంగాణ వంటకాలను ట్రంప్ కు రుచి చూపించబోతున్నారు చంద్రశేఖర్ రావు. ఈనెల 24, 25 తేదీల్లో భారత పర్యటనకు వస్తున్న అమెరికా అద్యక్షుడు ట్రంప్ తో విందులో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్కు రాష్ట్రపతి కార్యకార్యలయం నుండి ఆహ్వానం అందింది.
డొనాల్డ్ ట్రంప్ మంచి భోజన ప్రియుడే.. తెలంగాణ ఐటెమ్స్ కి ఫిదా అవ్వక తప్పదు..
ఈనెల 25న రాష్ట్రపతి భవన్ లో డొనాల్డ్ ట్రంప్ తో విందులో పాల్గొనబోయే సీఎం చంద్రశేఖర్ రావు, ట్రంప్ కు ఓ తీయని జ్ఞాపకాన్ని కూడా అందివ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. విందు భోజనం ముగించుకుని వస్తే కిక్కేముందని భావించిన సీఎం, ట్రంప్ కు తెలంగాణ రుచులను పరిచయం చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా అమెరికా అద్యక్షుడికి ఇచ్చే బహుమతులతో పాటు తెలంగాణ వంటకాలైన సర్వపిండి, సకినాలు, నాటుకోడి పకోడి ఐటెమ్స్ ను ట్రంప్ కు రుచిచూపించబోతున్నారు కేసీఆర్. వీటిని నిష్ణాతులైన వంటగాళ్లతో ప్రిపేర్ చేయించడంతో పాటు వెరైటీగా ప్యాక్ చేయిస్తున్నట్టు ప్రగతి భవన్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ వంటకాలకు ఓ బ్రాండ్ ఉండగా రేపు ట్రంప్ టేస్ట్ చేసిన తర్వాత వాటి బ్రాండ్ ఇంకెంత స్థాయికి వెళ్తుందో చూడాలి.