ఎన్నికలపై అపోహలు ఎందుకు?.. అసత్య ప్రచారం చేస్తే కేసులు : రజత్ కుమార్
హైదరాబాద్ : ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉండాలే గానీ.. అపోహలెందుకంటూ ప్రశ్నించారు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్. ఈవీఎంలపై సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ వదంతులేనని స్పష్టం చేశారు. 2018 రాజస్థాన్ ఎన్నికల క్లిప్పింగ్ వాట్సాప్ లో ప్రచారం చేస్తూ రాష్ట్రంలో లేనిపోని అనుమానాలు క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు. అసత్య ప్రచారాలు చేస్తే పోలీస్ కేసులు పెడతామని హెచ్చరించారు. మొన్నటి లోక్సభ ఎన్నికల పోలింగ్ పర్సంటేజీపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు.
పోలింగ్ శాతం మరుసటి రోజే..!
ఎన్నికలు జరిగిన రోజే వాస్తవ పోలింగ్ శాతం ప్రకటించడం అసాధ్యమన్నారు రజత్ కుమార్. కేంద్ర ఎన్నికల సంఘం ఎస్టిమేషన్ పర్సంటేజీ అడుగుతుంది కాబట్టి పోలింగ్ జరిగిన నాడు అంచనాలతో పోలింగ్ శాతం రిలీజ్ చేస్తామన్నారు. మంగళవారం నాడు సచివాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన రజత్ కుమార్ పలు అంశాలను ప్రస్తావించారు.
పోలింగ్ శాతాలపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు రజత్ కుమార్. పోలింగ్ ముగిశాక వెంటనే అంచనా వివరాలు ఇస్తామని తెలిపారు. మరుసటి రోజు మాత్రమే పోలింగ్ శాతంపై స్పష్టమైన సమాచారం ఇవ్వగలమని చెప్పుకొచ్చారు. పోలింగ్ జరిగాక మరుసటి రోజు పర్సంటేజీలు ఇవ్వడంపై రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు.
హైకోర్టులో 'బీసీ' లకు లభించని ఊరట.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
అది పెద్ద ప్రాసెస్.. అనుమానాలెందుకో?
ఎన్నికల తంతు అయిపోయాక రిటర్నింగ్ ఆఫీసర్ పోలింగ్ ఏజెంట్ల సంతకం తీసుకుంటారని.. అలాగే 17ఏ, 17సీ కాపీ వారికి ఇస్తారని తెలిపారు. అదే క్రమంలో మొన్నటి లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిశాక ఈవీఎంలకు 17ఏ, 17సీ కాపీలను అటాచ్ చేస్తూ సీల్ వేసి స్ట్రాంగ్రూంలో భద్రపరిచినట్లు తెలిపారు. అయినా కూడా కొందరు ఇంకా అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదన్నారు. రాజకీయ పార్టీల నేతలతో పాటు సెంట్రల్ నుంచి వచ్చిన ఆబ్జర్వర్ సమక్షంలో సీసీ కెమెరాల రికార్డింగ్ తో స్ట్రాంగ్ రూమ్ కు ఈవీఎంలు తరలుతాయని తెలిపారు.
అసత్య ప్రచారం చేస్తే కేసులే..!
ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని.. అపహాస్యం చేసేలా ప్రవర్తించొద్దని కోరారు. ఎన్నికల నిర్వహణకు వేలమంది కష్టపడతారని.. అలాంటిది చిన్న అసత్య ప్రచారంతో వారి కష్టమంతా వృధా అవుతుందని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ఈవీఎంలు, వీవీప్యాట్లపై అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. అసత్య ప్రచారాలతో అనుమానాలు మరింత బలపడే అవకాశముందన్నారు. ఇష్టమొచ్చినట్లుగా సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తే పోలీస్ కేసులు బుక్ చేస్తామని హెచ్చరించారు.