టెన్త్ స్టూడెంట్స్ ఎక్కాలు రాకపోతే.. పరీక్ష పాసవుతారా? మంత్రి హరీష్ ఆగ్రహం..టీచర్గా మారి..
తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్రావు టీచర్గా మారారు. అవును ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను టేబుళ్లు అడిగారు. పదో తరగతి విద్యార్థులు పదో టేబుల్ వరకు మాత్రమే వస్తాయని చెప్తున్నారని, ఏం నేర్పిస్తున్నారని టీచర్లపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం సంగారెడ్డి జిల్లా కంది ప్రభుత్వ పాఠశాలలను మంత్రి హరీశ్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
టేబుల్స్ రావా..?
కంది ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులను ఎక్కాలు చెప్పమని అడిగారు. ఓ విద్యార్థి మాత్రం 10 టేబుల్ వరకు మాత్రమే వస్తాయని చెప్పడంతో.. ప్రిన్సిపల్ సర్ ఇదేంటి అని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఫిప్త్ క్లాస్ విద్యార్థులే పదో టేబుల్ చెబుతారు కదా అని అడిగారు. టెన్త్ విద్యార్థులకు 10 టేబుల్ వరకే వస్తాయని చెప్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
ఒక్కరు కూడా..
తరగతి గదిలో నలుగురి విద్యార్థులను అడిగినా ఒక్కరు కూడా టేబుల్ సరిగా చెప్పలేకపోయారు. మరో మూడు నెలల్లో పబ్లిక్ పరీక్షలు ఉన్నాయని గుర్తుచేశారు. ఇలా అయితే వీరు ఎలా పాసవుతారని అడిగారు. ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి ఉంటుందా అని హెడ్మాస్టర్ని అడిగారు. ఇక్కడున్న నలుగురు విద్యార్థులు 11, 14, 16 టేబుల్స్ చెప్పలేకపోయారని మంత్రి చెప్పారు.
సోషల్ మీడియాకు దూరం..
తర్వాత హైదరాబాద్ హైటెక్స్లో జరిగిన తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనెజ్మెంట్ అసోసియేషన్ (టీఆర్ఎస్ఎం) కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. విద్యార్థులు సోషల్ మీడియాకు బానిస కాకుడదని సూచించారు. ర్యాంకుల పేరుతో విద్యార్థులను వేధించొచ్చని యాజమాన్యాలను కోరారు. స్టూడెంట్స్కు చిన్నప్పటి నుంచే నియమ, నిబంధనలు చెప్పాలని టీచర్లకు సూచించారు. పద్దతులు చెబితే విద్యార్థి దశలోనే నేర్చుకుంటారని పేర్కొన్నారు.
సతతం హరితం..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత తెలంగాణ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. మొక్కలు పెంచడం, కాపాడే విషయంలో విద్యార్థులకు నిర్దేశనం చేయాలని కోరారు. ప్లాస్టిక్ ప్రీగా తెలంగాణను మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లేదంటే హైదరాబాద్ మరో ఢిల్లీలా మారుతుందని చెప్పారు. భాగ్యనగరమే కాకుండా గ్రామాలు కూడా అదేవిధంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.