ఖజానాకు ఢోకా లేదట.. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఓకేనట.. ఆ సారు లెక్కలు చెప్పారుగా..!
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఖజానా పరిస్థితి ఆశాజనకంగానే ఉందంటున్నారు ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.రామకృష్ణారావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత ఏడాది అధిక ఆర్థిక వృద్ధి నమోదైందని తెలిపారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి సరిగా లేదంటూ వార్తలు వస్తున్న క్రమంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఉద్యోగులకు వేతనాల దగ్గర్నుంచి వివిధ సంక్షేమ పథకాలకు నిధులు సకాలంలోనే సమకూరుస్తున్నట్లు తెలిపారు.
ఖజానాకు ఢోకా లేదు..!
స్టేట్ ఓన్ ట్యాక్స్ పరంగా కూడా తెలంగాణ నంబర్ వన్గా నిలిచిందన్నారు రామకృష్ణారావు. ఆర్థిక వృద్ధి రేటు నమోదులో దేశవ్యాప్తంగా తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. జీఎస్టీ అమలవుతున్నదాన్ని బట్టి చూస్తే.. రాష్ట్ర ఖజానా పరిస్థితేంటో అర్థమవుతుందన్నారు. వృద్ధి రేటు గనక 14 శాతం కంటే తక్కువ నమోదైతే.. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిధి నుంచి మినహాయింపు ఇస్తుంది. దాన్ని బట్టి తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటుకు ఢోకా లేదనే విషయం స్పష్టమవుతోందని తెలిపారు.
వారెవ్వా.. ప్రారంభమే కాలేదు.. కరీంనగర్ రూపాయి పథకానికి ప్రశంసలు
నిధుల కొరత లేదు..!
తెలంగాణ ఆర్థిక పరిస్థితి సరిగా లేదంటూ ఇటీవల వార్తలొస్తున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ పథకాలకు నిధుల కొరత లేదంటూ ఆయన వివరణ ఇచ్చారు. సాధారణంగా పెట్టుబడులు పెరిగేకొద్దీ ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతుంది. రాష్ట్రాల ఆదాయం పెరిగే క్రమంలో ఖర్చులు కూడా పెరుగుతాయని వెల్లడించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్న రామకృష్ణారావు.. పెన్షన్లకు అవసరమైన నిధులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని చెప్పుకొచ్చారు. రైతుబంధు కోసం రబీ సీజన్లో 5 వేల 200 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణమాఫీ అమలు చేస్తామన్నారు. మే నెలాఖరు నుంచి జూన్ మొదటి వారం వరకు రైతుబంధు సాయం పంపిణీ చేస్తామని వివరించారు.
నెలకు 2 వేల కోట్ల చెల్లింపులు
కేంద్ర గణాంకాల సంస్థ లెక్కలు చూసినట్లయితే 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ స్థూల జాతీయోత్పత్తి (GSDP) 8 లక్షల 65 వేల 875 కోట్లుగా నమోదైనట్లు తెలిపారు. ఇక ఆర్థిక వృద్ధి రేటు 15 శాతంగా నమోదైందని వివరించారు. గడిచిన ఐదేళ్లలో తెలంగాణ కాపిటల్ ఎక్స్పెండిచర్ లక్షా 64వేల 519 కోట్లని వెల్లడించారు.
ప్రతి పదిహేను రోజులకోసారి బిల్లులు పే చేస్తుంటామని.. నెలకు దాదాపుగా 2వేల కోట్ల వరకు చెల్లిస్తుంటామని తెలిపారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు మొత్తం వ్యయం 46 వేల 960కోట్లు కాగా, ఇప్పటివరకు 27 వేల 509 కోట్లు ఖర్చైనట్లు చెప్పారు. మిషన్ భగీరథలో పెండింగ్లో ఉన్న బిల్లులు కేవలం 659 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న బిల్లులు 3 వేల 474కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు.