తెలంగాణ తొలి హోం మంత్రి కన్నుమూత: కార్మికుడి స్థాయి నుంచి ఉద్యమనేతగా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత, తొలి హోం శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన న్యుమోనియాతో బాధపడుతున్నారు. రెండు వారాల కిందట అపోలో ఆసుపత్రిలో చేరారు. వారం రోజుల కిందట ఆయన పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ అమర్చారు. ఆయన ఆరోగ్యం కుదుట పడలేదు. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత తుదిశ్వాస విడిచారు. నాయినికి భార్య అహల్య, కుమారుడు దేవేందర్రెడ్డి, కూతురు సమతారెడ్డి ఉన్నారు.
సెప్టెంబర్ 28వ తేదీన ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారు. అనంతరం కోలుకున్నారు. ఆ తరువాత న్యుమోనియాకు గురయ్యారు. చికిత్స కోసం అపోలో ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతుండగానే పరిస్థితి విషమించింది. ఆయన ఆరోగ్య సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. సాయంత్రమే అపోలో ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన పరామర్శించిన కొన్ని గంటల్లోనే నాయిని కన్నుమూశారు.
తెలంగాణ ఆవిర్భవించిన తరువాత తొలి హోం మంత్రిగా తన పేరును ఆయన చరిత్రలో లిఖించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన రాజకీయ ప్రస్థానం ఓ సంచలనం. అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి టీ అంజయ్యను ఓడించిన ఘనత ఆయనకు ఉంది. ముషీరాబాద్ నియోజకవర్గం ఆయనకు కంచుకోట. 1978 ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నాయిని.. అంజయ్యను ఓడించారు. అదే పార్టీ అభ్యర్థిగా మళ్లీ.. 1985లో పోటీ చేసి గెలించారు. అనంతరం 2004లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ముషీరాబాద్ నుంచి గెలుపొందారు.
అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్-టీఆర్ఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1969 నుంచీ ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాలను సాగించారు. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. హోం శాఖ మంత్రిగా బాధ్యతలను అందుకున్నారు. నాయిని నర్సింహా రెడ్డి స్వస్థలం నల్లగొండ జిల్లా చందంపేట మండలం నేరేడుగొమ్మ. హైదరాబాద్లో ఓ సాధారణ కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించారు. క్రమంగా కార్మిక నాయకుడిగా ఎదిగారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో ఆయన అరెస్టు అయ్యారు. 19 నెలల పాటు జైలుజీవితాన్ని గడిపారు.