విన్నపాలు వినవలె: జోనల్ సవరణలకు ఆమోదం తెలుపండి.. కేంద్రానికి తెలంగాణ లేఖ
జోనల్ వ్యవస్థకు సంబంధించిన సవరణలకు ఆమోదం తెలుపాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ములుగు, నారాయణపేట జిల్లాలను పీవోలో చేర్చాలనే ప్రతిపాదనలు చేసింది. దీనికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కోరింది. ఇప్పటికే సవరణ ప్రక్రియ ఆలస్యమైందని.. త్వరగా సవరించాలని కోరింది.
వికారాబాద్ జిల్లాను జోగులాంబ గద్వాల జోన్ నుంచి చార్మినార్ జోన్లోకి మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సవరణ ఉత్తర్వుల్లో జాప్యం వల్ల కొత్త ఉద్యోగ నియామకాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వివరించింది. కొత్తగా ఉద్యోగాలను నియమించే పరిస్థితి లేదని పేర్కొంది. వెంటనే రాష్ట్రపతి ఉత్తర్వులను సవరిస్తే ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడుతామని అందులో ప్రత్యేకంగా పేర్కొంది. జోనల్ వ్యవస్థ సవరణకు సంబంధించి పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. తాజాగా మరోసారి పరిపాలనశాఖ సర్వీసెస్ విభాగం లెటర్ పంపించింది.
సవరణ ఉత్తర్వులను జారీచేయకపోవడంతో ఉద్యోగ నియామకాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని గుర్తుచేసింది. దీంతో ఇప్పుడున్న సిబ్బందికి పనిభారం ఎక్కువవుతుందని తెలిపింది. సవరణ ఉత్తర్వులు జారీచేస్తే.. న్యాయపరంగా చిక్కులు ఉండవని అభిప్రాయపడింది. అందుకోసమే కొత్త నియామకాలను చేపట్టలేకపోతున్నామని వివరించింది. జోనల్ వ్యవస్థకు సంబంధించి సీఎం కేసీఆర్ కూడా ప్రధాని మోడీ, కేంద్రమంత్రులను పలుమార్లు విన్నవించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో విభజన సమస్యలతోపాటు జోనల్ వ్యవస్థ గురించి వారి మధ్య చర్చకొచ్చింది. ఈ క్రమంలోనే పరిపాలనశాఖ మరోసారి లేఖాస్త్రం సంధించింది.