రేవంత్ రెడ్డి అరెస్ట్ వివాదంలో ప్రభుత్వం కౌంటర్.. కోర్టుకు ఏమని చెప్పింది?
Recommended Video
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ వివాదస్పదమైంది. ఆయన విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూనే డీజీపీ నేరుగా హాజరుకావాలని ఆదేశించింది. అదలావుంటే తాజాగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడం చర్చానీయాంశమైంది.
రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంలో సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. అయితే తమ వాదనలు గురువారం వినిపిస్తామని రేవంత్ రెడ్డి తరపు లాయర్ కోర్టుకు తెలపడంతో తదుపరి విచారణ 20వ తేదీకి వాయిదా వేసింది.
అప్పుడేం జరిగింది.. అసలు కథేంటి
ఎన్నికల ప్రచారం సందర్భంగా కొడంగల్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేయడం వివాదస్పదంగా మారింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటామన్న రేవంత్ రెడ్డి ప్రకటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో కేసీఆర్ పర్యటనకు ముందు అర్ధరాత్రి రేవంత్ రెడ్డి ఇంటి తాళాలు పగులగొట్టి మరీ ఆయనను అరెస్ట్ చేయడం కలకలం రేపింది.
ఎమ్మెల్యే అభ్యర్థి అని కూడా చూడకుండా పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అంతేకాదు ఈ విషయంలో హైకోర్టుకు వెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈసీకి మొట్టికాయలు వేసింది. అర్ధరాత్రి పూట ఆయనను అరెస్ట్ చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించింది. అంతేకాదు తెలంగాణ డీజీపీని నేరుగా హాజరుకావాలని ఆదేశించింది.
ప్రభుత్వం వెర్షన్ ఏంటి?
రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై ప్రభుత్వం ఆచితూచి స్పందిస్తోంది. సోమవారం హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేసింది. రేవంత్ అరెస్ట్ సందర్భంగా పోలీసులు అతిగా వ్యవహరించలేదని కోర్టుకు తెలిపినట్లు సమాచారం. కేసీఆర్ సభను అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతో.. శాంతిభద్రతలకు భంగం కలగకుండా మాత్రమే ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు కోర్టుకు విన్నవించినట్లు తెలుస్తోంది. అంతేగానీ ఉద్దేశపూర్వకంగా చేసిందేమీ లేదని చెప్పినట్లుగా సమాచారం.
ఈ వివాదంలో ప్రభుత్వం గట్టెక్కేనా?
రేవంత్ రెడ్డి అరెస్ట్ వివాదంలో గట్టెక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులోభాగంగా సోమవారం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. గురువారం జరగనున్న తదుపరి విచారణలో కూడా తన వాదనలు వినిపించనుంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో అల్లర్లు చెలరేగకుండా మాత్రమే తెలంగాణ పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారనే విషయం కోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది. అయితే న్యాయస్థానం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.