ప్రజారోగ్యంపై తెలంగాణ సర్కార్ నజర్.. పేదలకు 58 రకాల ఆరోగ్య పరీక్షలు ఫ్రీ
హైదరాబాద్ : కంటి వెలుగు లాంటి పథకంతో రాష్ట్ర ప్రజలకు ఉచిత కంటి వైద్య సేవలు అందించిన ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విష జ్వరాలు ప్రబలుతున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేద ప్రజలకు కాసింత ఊరట కలిగించనుంది. చిన్న జ్వరానికే వివిధ పరీక్షల పేరిట వేల రూపాయలు గుంజుతున్న ప్రైవేట్ దవాఖానాలకు చెక్ పెట్టే విధంగా సర్కార్ తీసుకున్న కొత్త నిర్ణయం పేదలకు కొంత మేలు చేయనుంది. పేద ప్రజలకు 58 రకాల ఉచిత పరీక్షలు చేయించేందుకు సిద్ధమైంది. దాంతో హెల్త్ టెస్టుల పేరిట కొనసాగుతున్న ప్రైవేట్ దోపిడీకి కొంతలో కొంత అడ్డుకట్ట పడనుంది.
వైద్య పరీక్షలకే బోలెడు డబ్బులు..! ఈ తరుణంలో సర్కార్ నయా స్కీమ్
తెలంగాణలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. రాష్ట్రమంతటా ఎక్కడ చూసినా ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇదే అదనుగా ఆరోగ్య పరీక్షల పేరిట వేలాది రూపాయలు గుంజుతున్నారు కొందరు. ఆ టెస్టు ఈ టెస్టు అంటూ అందినకాడికి దండుకుంటున్నారు. ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు. దాంతో పేదల పరిస్థితి దయనీయంగా మారింది. కేవలం టెస్టులకే ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టే పరిస్థితి దాపురించింది. ఇక మందులు కొనడానికి చేతిలో డబ్బులు లేక నానా అవస్థలు పడుతున్న సందర్భాలు కొకొల్లలు.
తెలంగాణ కేబినెట్ భేటీకి ముహుర్తం.. బావ బామ్మర్దులది కీ రోలా.. కీలక అంశాలు ఇవేనా?
58 రకాల ఉచిత వైద్య పరీక్షలు
ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు భరోసా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 58 రకాల ఉచిత వైద్య పరీక్షలు చేయించేందుకు సిద్ధమైంది. రక్త పరీక్ష మొదలుకొని మల మూత్ర పరీక్షలతో పాటు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలను నిర్ధారించే పరీక్షలను కూడా ఫ్రీ గా అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాదు థైరాయిడ్, లివర్, కిడ్నీలు, కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ తదితర 58 రకాలకు సంబంధించిన హెల్త్ టెస్టులను ఉచితంగా చేయించేలా ఇప్పటికే చర్యలు తీసుకుంది. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫ్రీ వైద్య పరీక్షలు చేయించుకునే వెసులుబాటు కల్పించింది.
ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు
రోగ నిర్ధారణ పరీక్షల కోసం ఇదివరకు ప్రత్యేకంగా బడ్జెట్ అంటూ ఏమీ కేటాయించలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రజారోగ్యంపై దృష్టి సారించింది. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రమంతటా జిల్లా కేంద్రాల్లో డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాదు వాటి నిర్వహణ కోసం తెలంగాణ సర్కార్ ప్రత్యేక బడ్జెట్ను కూడా కేటాయించడం విశేషం. అలాగే డయాగ్నస్టిక్ కేంద్రాల నిర్వహణ కోసం TSMSIDCలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. అలా ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఆస్కారం ఏర్పడింది.
అధికారం కోసం సెక్స్ రాకెట్.. మధ్యప్రదేశ్ స్కాండల్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
యంత్రాల నిర్వహణకు కోట్లాది రూపాయల ఖర్చు
డయాగ్నస్టిక్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన యంత్రాల మెయింటెనెన్స్ కోసం ప్రతి యేటా దాదాపు 16 కోట్ల రూపాయల వరకు ఖర్చు కానున్నట్లు తెలుస్తోంది.
వైద్య పరీక్షలు కూడా పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు ఉన్నతాధికారులు. అంతేకాదు యంత్రాలు, మెషీన్లలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే వాటిని వెంటనే పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకునేలా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. జిల్లాల వారీగా ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేసి పేద ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ చక్కర్లు కొడుతూ జేబులకు చిల్లులు పెట్టుకుంటున్న పేద ప్రజలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్రీ టెస్టులు కొంతలో కొంత ఊరట కలిగించనున్నాయి.