ఒకేరోజు..ఒకే సమయానికి తెలంగాణ వ్యాప్తంగా ఏకం కానున్న కోట్లాది గొంతుకలు: ఎక్కడివారు అక్కడే
హైదరాబాద్: దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఓ అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించడానికి శ్రీకారం చుట్టింది. దీనికి ముహూర్తాన్ని ఖాయం చేసింది. ఆ ముహూర్తానికి తెలంగాణవ్యాప్తంగా కోట్లాది గొంతుకలు ఏకం కానున్నాయి. దీన్ని విజయవంతం చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోంది.
22 వరకూ..
ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వజ్రోత్సవాల వేడుకలను నిర్వహిస్తోంది. హైదరాబాద్ హెచ్ఐసీసీలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే ప్రారంభించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. వజ్రోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. వాటిని విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ నెల 22వ తేదీన ఈ వజ్రోత్సవ వేడుకలు కొనసాగనున్నాయి.
వ్రజోత్సవ వేడుకలు..
వజ్రోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలతో కూడిన షెడ్యూల్ను ప్రభుత్వం ఇదివరకే విడుదల చేసింది. పంద్రాగస్టు సందర్భంగా సోమవారం రాష్ట్రంలోని ప్రతి ఇంటి మీదా జాతీయ జెండా ఎగురవేయడాన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దీనికోసం 1.2 కోట్ల జెండాలను పంపిణీ చేస్తోంది. అన్ని సినిమా థియేటర్లల్లో ఉదయం పూట పాఠశాలల విద్యార్థుల కోసం రిచర్డ్ అటెన్బరో నిర్మించిన 'గాంధీ' చిత్రాన్ని ప్రదర్శిస్తారు. 22వ తేదీన ఎల్బీ స్టేడియంలో ముగింపు వేడుకలు నిర్వహించనుంది.
ఎల్లుండి ఉదయం..
ఇందులో భాగంగా- 16వ తేదీన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఉదయం 11:30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఇది అమలు కానుంది. సరిగ్గా 11:30 గంటలకు ప్రతి ఒక్క పౌరుడు ఎక్కడి వారు అక్కడే నిల్చుని జాతీయ గీతాన్ని ఆలపించేలా చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించిన ఓ ప్రోమో వీడియోను ఐటీ, మున్సిపల్ పరిపాలన మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసింది. కేసీఆర్ ఇచ్చిన సందేశాన్ని..నిమిషం పాటు నిడివి ఉన్న ఈ వీడియోలో పొందుపరిచారు.
ప్రతి పౌరుడూ..
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేసీఆర్ సహా మంత్రులు, అధికారులు, అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎక్కడి వారు అక్కడే నిల్చుని జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. వాహనదారులు సైతం తమ వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేసి.. సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొనాల్సి ఉంటుంది. తెలంగాణ పౌరుల జాతి ఐక్యతను చాటి చెప్పేలా దీన్ని విజయవంతం చేయాలంటూ కేసీఆర్ ఇప్పటికే పిలుపునిచ్చారు.
సండే ఫన్డే కూడా రెడీ..
మరోవంక- మూడేళ్ల కిందట నిలిచిపోయిన సండే ఫన్డే కార్యక్రమాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ సాయంత్రమే అది ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్బండ్పై సండే ఫన్డే వేడుకలు ఏర్పాటు కానున్నాయి. వేలాదిమంది హైదాబాదీయులు దీనికి హాజరు కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తోన్న నేపథ్యంలో- దీనికి అనుగుణంగా అక్కడ ఏర్పాట్లు పూర్తయ్యాయి.