మూడు నెలల్లో తెలుగు నేర్చుకుని మాట్లాడతా అంటున్న తెలంగాణా గవర్నర్ తమిళిసై
తెలంగాణా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మూడు నెలల్లో తెలుగు నేర్చుకుని తెలుగులో మాట్లాడతాను అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సామాజిక, రాజకీయ పరిస్థితులపై అవగాహన పెంచుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్న ఆమె తెలంగాణ రాష్ట్ర ప్రజలతో మమేకం అయ్యేందుకు తెలుగు నేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
గవర్నర్ తమిళిసై ప్రజల వద్దకు పాలన.. జనం కోసం ఏం చేస్తున్నారో తెలుసా?
హైదరాబాద్ ముషీరాబాద్ లో జాగృతి ఫౌండేషన్ నిర్వహించిన మహిళా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై ఈ సందర్భంగా తెలుగులో తన ఉపన్యాసాన్ని మొదలు పెట్టారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన తమిళిసై తెలుగు భాషాభిమానాన్ని తన మాటల్లో ప్రదర్శించారు. స్వతహాగా తమిళులకు తమ భాష అంటే యెనలేని మక్కువ . అలాంటి తమిళ నాడు రాష్ట్రానికి చెందిన ఆమె మూడు నెలల్లో తెలుగు నేర్చుకుని, మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
మహిళా నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమంలో మాట్లాడిన ఆమె మహిళలు ప్రతి రంగాన్ని ఒక సవాల్ గా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహిళలుసాధికారత దిశగా అడుగులు వెయ్యాలని తమకు నచ్చిన ఏదో ఒక రంగాన్ని ఎంచుకుని, అందులో నైపుణ్యతను సాధించాలని చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్యంపై మహిళలు శ్రద్ధ చూపాలని తమిళిసై సూచించారు. ఏది ఏమైనా తెలంగాణా రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఇప్పటి వరకు తెలంగాణా సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించడమే కాకుండా, సామాన్య ప్రజలకు మరింత చేరువ కావటానికి తెలుగు భాషను సైతం నేర్చుకోవాలని తమిళిసై నిర్ణయం తీసుకున్నారు.