వైన్స్ తెరవటంపై ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోలుపై లేదు : కేసీఆర్ పై ఉత్తమ్ ఫైర్
కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో తెలంగాణా సర్కార్ తీరుపై ప్రతిపక్ష పార్టీలు నిప్పులు చేరుగుతున్నాయి. నిన్నటికి నిన్న కరోనా నియంత్రణా చర్యలపై గవర్నర్ తమిళి సై జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక తాజాగా రైతుల సమస్యలను గాలికొదిలేసిన తెలంగాణా సర్కార్ పై ఒత్తిడి తీసుకురావటానికి రైతు సంక్షేమ దీక్ష నిర్వహిస్తుంది. ఇక గాంధీ భవన్ వేదికగా రైతు సంక్షేమ దీక్ష చేపట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణా సర్కార్ పై విమర్శలు గుప్పించారు .
ఇయాల్టి ప్రెస్ మీట్ లో అయినా నిజం చెప్పు దొరా .. ఆ కేంద్ర నిధులేం చేసినవ్ : ఎంపీ అరవింద్ సూటి ప్రశ్న
గాంధీ భవన్ లో రైతు సంక్షేమ దీక్ష చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణా ప్రభుత్వానికి వైన్ షాప్లు తెరవడానికి ఉన్న శ్రద్ధ రైతుల ధాన్యం కొనుగోలుపై లేదని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రైతు సంక్షేమ దీక్షలో పాల్గొన్న ఆయన తెలంగాణా సర్కార్ మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదన్నారు. సీఎం కేసీఆర్ మాటలు చెప్పి మభ్యపెట్టటం తప్ప మరేం చెయ్యలేరని ఆయన మండిపడ్డారు . ఇక తెలంగాణా రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల వలస కూలీలు పడరాని పాట్లు పడుతున్నారని , వలస కూలీలను ఉచితంగా సొంత గ్రామాలకు తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి .
వలస కూలీల విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుంది
ఒక వేళ అవసరం అయితే కాంగ్రెస్ పార్టీ వలస కూలీల రవాణా ఛార్జీలను భరిస్తుందని ఆయన తెలిపారు. కేసీఆర్ మాటల వరకే పరిమితం అయ్యారని, వలస కూలీలు ఎంతమంది ఉన్నారనే విషయంలో ఒక డేటా కూడా ప్రభుత్వం దగ్గర లేదని ఉత్తమ్ మండిపడ్డారు. ఇక వారు వెళ్ళకుండా ఉండాలంటే వలస కూలీలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. వలస కూలీలు వెళ్లిపోతే తెలంగాణలో అభివృద్ధి కుంటుపడుతుందని ఉత్తమ్ అన్నారు.
తడిసిన ధాన్యం కొనుగోలు చెయ్యాలని డిమాండ్
ఇక కొనుగోలు చెయ్యకుండా ఐకేపీ సెంటర్ల వద్ద ఉంచిన తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు . ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి రైతు దీక్ష చేపట్టామని పేర్కొన్న ఉత్తమ్ తెలంగాణా రాష్ట్రంలో కరోన లాక్ డౌన్ తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు . లాక్డౌన్ నేపథ్యంలో పనుల్లేక పస్తులు ఉంటున్న ప్రతీ పేద కుటుంబానికి రూ. 5 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం కంటి తుడుపు చర్యలో భాగంగా తెలంగాణ సర్కార్ ఆర్ధిక సాయం చేసిందని ఆయన పేర్కొన్నారు .
అడుగడుగునా పేదల్ని మోసం చేసిన తెలంగాణా సర్కార్ .. విరుచుకుపడిన ఉత్తమ్
తెలంగాణ ప్రభుత్వం 12 కేజీల బియ్యం విషయంలో మోసం చేసిందని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 12 కేజీల బియ్యంలో 5 కేజీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణా అధ్యక్షుడు ఉత్తమ్ గుర్తు చేశారు. మరో 6 కేజీల బియ్యం రెగ్యులర్గా ఇస్తారన్న ఉత్తమ్ లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం అదనంగా ఇచ్చింది ఒక కేజీ బియ్యం మాత్రమే అని మండిపడ్డారు.ఇక గాంధీభవన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్రెడ్డి, వీహెచ్, పొన్నం తదితరులు దీక్షకు కూర్చున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా కాంగ్రెస్ నేతలు ఈ దీక్ష నిర్వహిస్తున్నారు.