టార్గెట్ అశ్వధ్దామరెడ్డి : సమ్మెతో సాధించిందేంటి : ఇక.. ఆర్టీసీలో సంఘాలు ఉండవా?
తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ 48 రోజుల పాటు సమ్మె చేసింది. ప్రభుత్వం మాత్రం వారి డిమాండ్ల మీద అడుగు కూడా వెనక్కు వేయలేదు. హైకోర్టులో ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించింది. ఇక, కోర్టు సైతం ఈ వ్యవహారాన్ని కార్మిక శాఖకు బదిలీ చేసింది. దీంతో..ఇప్పుడు కార్మిక సంఘాల జేఏసీ సమ్మె విరమణకు ముందుకు వచ్చాయి. అయితే, ఈ 48 రోజుల పాటు చేసి సమ్మె ద్వారా సాధించిదేంటి.. ఏ హామీతో సమ్మె విమరించారనే అంశం పైన బయట పడకపోయినా..జేఏసీలోని ఒక సంఘం గట్టిగా నిలదీసినట్లు సమాచారం. కార్మికులు జేఏసీ నేతలను నమ్ముకున్నారు. ఖచ్చితంగా ప్రయోజనం జరుగుతుందని ఆశించారు. వారి మీద నమ్మకంతో ముఖ్యమంత్రి ఇచ్చిన డెడ్ లైన్ ను పట్టించుకోలేదు. ఇక, ఇప్పుడు సమ్మె విరమణ దిశగా నిర్ణయంతో కార్మికులతో సహా.. మరో కీలక సంఘానికి అశ్వధ్దామ రెడ్డి లక్ష్యంగా మారుతున్నారు. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా ప్రతిపక్షాలు సైతం.. ఏం చేయలేకపోయాయంటూ కార్మికులు జరిగిన పరిణామాలు గుర్తు చేసుకుంటున్నారు.
ఆర్టీసీ సమ్మె కేసులో కొత్త ట్విస్ట్: హైకోర్టులో ముగిసిన విచారణ: లేబర్ కోర్టుకి చేరిన పంచాయితీ..!
సమ్మె విరమణ ఏకాభిప్రాయం కాదా..
తెలంగాణలో ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె విరమణకు ముందుకు వచ్చాయి. ఉద్యోగులను బేషరతు గా ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరాయి. గతంలో..ముఖ్యమంత్రి స్వయంగా ఒక విషయాన్ని స్పష్టం చేసారు. కార్మికులు ఎవరైనా విధుల్లో చేరాలంటే ముందుగా యూనియన్లతో సంబంధం లేదని లిఖిత పూర్వకంగా రాసిచ్చి..ఉద్యోగాల్లో చేరవచ్చని చెప్పారు. అందుకు డెడ్ లైన్ సైతం విధించారు. కానీ, స్వల్ప సంఖ్యలో కార్మికులు మాత్రం విధుల్లో చేరారు. పూర్తిగా జేఏసీ నేతల మీదనే కార్మికులు నమ్మకం పెట్టుకున్నారు. ఇక, హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కార్మిక సంఘాలు సమ్మె విరమణకు ముందుకు వచ్చాయి. కానీ, అదే సమయంలో ఏ హామీతో సమ్మె విరమిస్తున్నారంటూ ఒక సంఘం నేతలు గట్టిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కార్మికులకు ఏం సమాధానం చెబుతారు.. ప్రభుత్వానికి సంఘాలు పలుచన అవుతాయంటూ వారు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
సమ్మె విషయంలో పట్టుదలకు పోయి..
ఆర్టీసీ పిలుపు సమయం నుండి జేఏసీ లోని ఒకరిద్దరు నేతలు సమ్మె చేయాలనే అత్యుత్సాహంతో ప్రభుత్వంతో చర్చలు సైతం పూర్తి చేయకుండానే..కార్మికులను సమ్మె లోకి దించారని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అందులో ప్రధానంగా కొద్ది రోజుల వరకు వినిపించిన ప్రభుత్వంలో ఆర్టీసి విలీనం సాధ్యం కాదని తాము తొలి నుండి చెబుతున్నా..మొండిగా వ్యవహరించారని..ఇప్పుడు ఆ డిమాండ్ వదులుకొని చర్చలకు పిలవాలంటూ మొదలు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జేఏసీ నేతలు ఒకరిద్దరి వైఖరి కారణంగానే..సమ్మె అర్దవంతమైన ముగింపు లేకుండా అర్దాంతంగా ముగించాల్సి వచ్చిందని మరో ప్రధాన కార్మిక సంఘాల నేతలు వ్యాఖ్యానించినట్లె సమాచారం. ప్రభుత్వం తో పట్టుదలకు పోయి..మొండిగా వ్యవహరంటానికి జేఏసీలోని ఆ ఇద్దరు నేతలే కారణమనే చర్చ మొదలైంది. అయితే, ఇప్పుడు సమ్మె విరమణ కు కార్మిక సంఘాలు ముందుకు వచ్చినా..ప్రభుత్వం నుండి స్పందన రావటం లేదు.
Recommended Video
కార్మిక సంఘాలకు గుర్తింపు ఉండదా..
ఇప్పుడు కార్మిక సంఘాల జేఏసీ సమ్మె విరమణకు ముందు ఎటువంటి కండీషన్లు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కానీ, ముఖ్యమంత్రి మాత్రం అసలు ఆర్టీసీలో ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడే సంఘాలు ఉండటానికి వీళ్లేదని గట్టిగా చెబుతున్నారు. దీంతో..కార్మిక సంఘాలు కోరినట్లుగా షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవటానికి ప్రభుత్వం సిద్దంగా లేనట్లుగా తెలుస్తోంది. సమ్మె విరమించి విధుల్లో వచ్చే కార్మికులను తీసుకొనేందుకు సిద్దంగా ఉన్న ప్రభుత్వం..యూనియన్లతో సంబంధం లేదంటూ డిక్లరేషన్ మాత్రం తీసుకోవాల్సిందేననే విషయంలో ఖచ్చితంగా ఉంది. దీంతో.. కార్మికులు సమ్మె ద్వారా తాము..కార్మిక సంఘాల నేతల నాయకత్వంలో పని చేసినా ఎటువంటి ప్రయోజనం పొందలేదనే ఆవేదనలో ఉన్నారు. ఈ సమయంలో ప్రభుత్వం కోరినట్లుగా డిక్లరేషన్లు ఇవ్వకుండా కార్మికులు విధుల్లో చేరే అవకాశం కనిపించటం లేదు. అదే జరిగితే..దశాబ్దాల కాలంగా ఆర్టీసీలో ఆధిపత్యం సాగిస్తున్న కార్మిక సంఘాలు ఇక కనిపిస్తాయా లేవా అనేది హాట్ టాపిక్ గా మారింది.