సెప్టెంబర్లో ఎంసెట్: ఆగస్టు 20 నుంచి డిజిటల్ క్లాసులు: సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో ఆగస్టు 20 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు డిజిటల్ తరగతులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ప్రవేశ పరీక్షలు, విద్యా సంవత్సరంపై సమీక్షించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు దూరదర్శన్, టీశాట్ ద్వారా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 1 నుంచి 3-5 తరగతుల విద్యార్థులకు డిజిటల్ తరగతులు ఉంటాయని తెలిపారు.
ఆగస్టు 17 నుంచి ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. సెప్టెంబర్ 1 తర్వాత ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ ఉంటుందని చెప్పారు. ఆగస్టు 31న ఈ సెట్, సెప్టెంబర్ 2న పాలిసెట్ నిర్వహిస్తామని తెలిపారు. అలాగే, సెప్టెంబర్ 9, 10, 11, 14న ఎంసెట్ నిర్వహించాలని భావిస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
మరోవైపు, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య పాపిరెడ్డి మాట్లాడుతూ.. హైకోర్టు అనుమతిస్తే ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటికే ఎంసెట్ సహా ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణకు ఉన్నత విద్యామండలి షెడ్యూల్ ప్రకటించినప్పటికీ కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో పరీక్షలు ఎప్పుడు జరుగుతాయోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.