ఆర్టీసి ఉద్యోగులకు ప్రభుత్వం రివర్స్ షాక్: ఇంకా అందని జీతాలు: ఒత్తిడి పెంచేందుకే..!
తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతున్న తెలంగాణ ఆర్టీసి కార్మికులకు ప్రభుత్వం రివర్స్ షాక్ ఇస్తోంది. ఆర్టీసి ఉద్యోగులకు ఈ నెల వేతనాలు ఇంకా అందలేదు. ఆర్టీసిలో గతంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా ప్రతీ నెలా ఒకటో తేదీన వేతనాలు జమ అయ్యేవి. ఆ తరువాత సంస్థ ఆర్దిక పరిస్థితి కారణంగా దానిని ప్రతీ నెలా అయిదో తేదీన చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఈ రోజు వేతనాలు మాత్రం ఉద్యోగుల ఖాతాల్లో జమ కాలేదు. ప్రభుత్వం నచ్చ చెప్పినా వినకుండా సమ్మెకు వెళ్లిన వారికి షాక్ ఇచ్చేందుకే ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందా అనే చర్చ మొదలైంది. పండుగ రోజుల్లో ప్రజలను ఇబ్బంది పెడుతున్నందుకే..ప్రభుత్వం కఠినంగా వ్యవహిరిస్తోందనే వాదన వినిపిస్తోంది. ఇదే సమయంలో పండుగ రోజుల్లో వేతనాలు రాకపోవటంతో కార్మికుల్లోనూ టెన్షన్ మొదలవుతోంది. సమ్మెలో ఉన్న వారిపైన ఒత్తిడి పెంచేందుకే ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.
అద్దె బస్సులపై దాడులు చేస్తున్న ఆర్టీసి కార్మికులు..!
ప్రభుత్వం రివర్స్ గేమ్..
తమ మాట లెక్క చేయకుండా సమ్మెకు దిగి పండుగ రోజుల్లో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారనే కారణంతో ఆర్టీసి ఉద్యోగుల మీద ప్రభుత్వం సైతం ఒత్తిడి పెంచే వ్యూహాలు అమలు చేస్తోంది. ఒక వైపు ఉద్యోగులు విధుల్లో చేరకపోతే తొలిగిస్తామని హెచ్చరిస్తూనే..మరో వైపు తాత్కాలిక నియామకాలను వేగవంతం చేసింది. ఇదే సమయంలో పెద్ద ఎత్తున ప్రయివేటు బస్సులను సేకరిస్తోంది. సమ్మెలో పాల్గొన్న వారి పైన కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. పోలీసు భద్రతతో బస్సులను నడిపే ప్రయత్నం చేస్తోంది. తాత్కాలిక ప్రాతిపదిక డ్రైవర్లు..కండక్టర్ల నియామకం వేగవంతం చేసింది.
తొలి రోజుల 9వేల బస్సులు నడిపాం..
సమ్మె ప్రారంభించిన తొలి రోజునే ఆర్టీసి అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి రోజు కార్మికులు సమ్మె చేస్తున్నా తొమ్మది వేల బస్సులు నడిపినట్లు అధికారులు ప్రకటించారు. అదే సమయంలో మరో 2778 ప్రయివేటు వాహనాల ద్వారా రవాణా కొనసాగించామని స్పష్టం చేసారు. ప్రయివేటు..అద్దె బస్సులతో పాటుగా స్కూలు బస్సులను సైతం వినియోగంలోకి తెచ్చారు. ఇప్పటికే ఆరు వేల మందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ ముగియటంతో ఇక విధుల్లో చేరని వారి పైన కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.
నిలిచిన వేతనాల విడుదల..
తెలంగాణ ఆర్టీసీలో ఆర్దిక ఇబ్బందుల కారణంగా ప్రతీ నెలా అయిదవ తేదీన జీతాలు చెల్లిస్తున్నారు. అయితే ఈ రోజు మాత్రం జీతాలు ఉద్యోగుల ఖాతాల్లో జమ కాలేదు. సమ్మెలోకి వెళ్లిన ఉద్యోగుల పైన ఒత్తిడి పెంచేందుకే ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం ఎక్కడా దిగి రావటం లేదనే సంకేతాల ద్వారా కార్మికుల పైన ఒత్తిడి పెంచే వ్యూహాలను అమలు చేస్తోంది. అందులో భాగంగానే తాత్కాలిక ఉద్యోగుల నియమాకం.. జీతాల నిలుపుదల.. వంటి నిర్ణయాలను అమలు చేస్తోంది. ఎన్ని రోజులు సమ్మె చేసినా తాము లెక్క చేయమనే సంకేతాలను ప్రభుత్వం ఇస్తోంది. దీంతో..ఈ సమ్మె ఎన్ని రోజులు చేసినా ఉపయోగం లేదనే భావన కార్మికుల్లో కలిగించటమే ప్రభుత్వం ఉద్దేశంగా స్పష్టం అవుతోంది. ఇప్పుడు జీతాలు ఇవ్వకపోవటంతో పండుగ సమయంలో ఆందోళన కనిపిస్తోంది.