టీఎస్ఆర్టీసీలో వీఆర్ఎస్..? తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన : 27 వేల మందికి గండం..!!
ప్రభుత్వ వర్సెస్ ఆర్టీసీ కార్మికులు అన్నట్లుగా మారిన తెలంగాణ ఆర్టీసీ వ్యవహారంలో ప్రభుత్వం కొత్త ఆలోచనల దిశగా అడగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా సమ్మె పైన ఇప్పటికే కార్మికులు తమ ప్రధాన డిమాండ్ గా చెప్పుకుంటూ వచ్చిన..ప్రభుత్వంలో విలీనం పైన వెనక్కు తగ్గారు. ఇప్పటికైనా చర్చలకు పిలవాలని కోరుతున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం మరింత కాలం సమ్మె చేయలేరని.. వారు వెనక్కు తగ్గుతారనే అంచనాతో ఉంది. అందులో భాగంగా ఇప్పటికే 5100 ప్రయివేటు బస్సులను పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయిస్తూ కార్మికుల మీద ఒత్తిడి పెంచింది. దీంతో పాటుగా..43 రోజులు అయినా సమ్మె ఆగక పోవటంతో కొత్త నిర్ణయాలు అమలు దిశగా కసరత్తు చేస్తోంది. అందులో..ఆర్టీసీ కార్మికులకు స్వచ్చంద పదవీ విరమణ పధకం అమలు చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం దీనిని ఇంకా బయట పెట్టకపోయినప్పటికీ..ఎప్పటికైనా ఆర్టీసీ లో ప్రవేటు భాగస్వామ్యం కావాల్సిందే అంటూ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి.
పార్లమెంట్ లో ఆర్టీసీ ప్రస్తావన వస్తే: కాంగ్రెస్..బీజేపీ సిద్దం : ఎంపీలకు కేటీఆర్ నిర్దేశం..!
టీఎస్ఆర్టీసీలో వీఆర్ఎస్..?
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తెగని పంచాయితీగా మారింది. ప్రభుత్వం..కార్మికులు ఎవరికి వారు మెట్టు దిగకపోవటంతో సమ్మె కొనసాగుతోంది. దీంతో..ప్రభుత్వం కొత్త ఆలోచనలకు రూప కల్పన చేస్తోంది. అందులో భాగంగా..తెలంగాణ ఆర్టీసీ కార్మికుల విషయంలో స్వచ్చంద పదవీ విరమణ అంశం పైన కసరత్తు చేస్తున్నట్లు విశ్వస నీయ సమాచారం. ప్రస్తుతం ఆర్టీసీ వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉండటంతో..ఈ సమయం లో కొత్త నిర్ణయాలు ప్రకటించలేరు. కోర్టు ఆర్టీసీ విషయంలో ఇచ్చే తీర్పు కార్మికులకు అనుకూలంగా ఉంటే సుప్రీంకు వెళ్లాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలిచ్చింది. ఇక, ఇదే సమయంలో కార్మికు ల మీద ఒత్తిడి పెంచటానికి స్వచ్చంద పదవీ విరమణ ప్రతిపాదన దిశగానూ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులోనూ కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలతో రావాలని భావిస్తోంది.
50 ఏళ్లు పైబడిన వారికి అమలు..
తెలంగాణ ఆర్టీసీలో వివిధ హోదాల్లో..కేటగిరీల్లో పని చేస్తున్న వారిలో 50 ఏళ్ల వయసు పైబడిన వారికి స్వచ్చంద పదవీ విరమణ అవకాశం ఇచ్చేలా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే మూడేళ్ల కాలంలో తెలంగాణ ఆర్టీసీలో దాదాపు ఏడు వేల మంది సిబ్బంది పదవీ విరమణ చేయాల్సి ఉంది. మొత్తం టీయస్ఆర్టీసీలో 49,733 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం 30 శాతం వరకు ప్రయివేటీకరణ తప్పదని స్పష్టంగా చెప్పింది. ఇదే సమయంలో ఆ నిర్ణయం దాదాపు 27 వేల మంది ఉద్యోగుల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే, తొలుత సమ్మెలో ఉన్న ఉద్యోగులు వారికి వారు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ ప్రభుత్వం చెప్పినా.. రాజకీయంగా ఆ నిర్ణయం సరి కాదని వెనకుడుగు వేసింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఈ వీఆర్ఎస్ ప్రతిపాదన పైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తగ్గనున్న ఆర్టీస బస్సులు.. పెరగనున్న పర్మిట్లు
ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో తెలంగాణలో 5100 ప్రయివేటు బస్సులను పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అదే విధంగా 1035 అద్దె బస్సులను తీసుకోవాలని నిర్ణయించింది. దీని ద్వారా ప్రస్తుతం 8357 గా ఉన్న ప్రభుత్వ బస్సుల సంఖ్య 5357కి తగ్గనుంది. దీంతో పాటుగా 2500 పాత బస్సులు ఇంకా కొనసాగిస్తే ప్రయాణీకులకే ప్రమాదంగా మారుతుందని చెబుతున్న ప్రభుత్వం వాటిని తొలిగించాలని డిసైడ్ అయింది. ఇక, కొత్తగా ప్రయివేటు పర్మిట్లు గ్రామీణ ప్రాంతాలకు..నిత్యం రద్దీగా ఉండే రూట్లలో కాకుండా.. దూర ప్రాంతాల సర్వీసులకు పోటీగా పర్మిట్లు ఇవ్వాలని భావిస్తోంది. దీని ద్వారా తాము ఆర్టీసీని నిర్వీర్యం చేయకుండా..పోటీ పెండి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకొనే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
27 వేల మందికి గండం..
ప్రభుత్వం ఆలోచన చేస్తున్న స్వచ్యంద పదవీ విరమణ పధకం అమలు చేస్తే..దాదాపు 27 వేల మంది కార్మికుల పైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే, సంస్థ మనుగడను పరిగణలోకి తీసుకొని అటు సంస్థకు..ఇటు ఉద్యోగులకు నష్టం లేకుండా ఈ ప్రతిపాదన తెర మీదకు తెస్తున్నామని చెప్పుకొనే ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా కేంద్రం బీఎస్ఎన్ఎల్ లో ఇదే రకంగా నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల నుండి అనూహ్య స్పందన వచ్చిన విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. అయితే, కోర్టుల్లో ఉన్న ప్రస్తుత వ్యవహారం పైన ఒక స్పష్టత వచ్చిన తరువాత ప్రభుత్వం ఈ ప్రతిపాదన మీద అడుగులు ముందుకు వేసే అవకాశం కనిపిస్తోంది.