ఆకస్మాత్తుగా లాక్డౌన్ ఏంటీ? అంబులెన్స్ ఆపడం రాజ్యాంగ విరుద్ధం తెలుసా?: సర్కారుపై హైకోర్టు ఫైర్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరిస్థితులు, సరిహద్దులో అంబులెన్స్లను అడ్డుకోవడంపై మంగళవారం మధ్యాహ్నం మరోసారి హైకోర్టు విచారించింది. రాష్ట్ర కేబినెట్ లాక్డౌన్ తీసుకున్న నిర్ణయంపై అడ్వోకేట్ జనరల్(ఏజీ) ప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మే 12 నుంచి 10 రోజులపాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన విషయాన్ని తెలిపారు.
అంబులెన్స్లను ఎవరు అపమన్నారు? పాతబస్తీ పరిస్థితి ఏంటీ?: కేసీఆర్ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
ఆకస్మాత్తుగా లాక్డౌన్ అంటే ఎలా?
ఈ సందర్బంగా తెలంగాణలో ఆకస్మికంగా రాష్ట్రంలో లాక్డౌన్ విధించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వారాంతపు లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ పొడిగించమంటే పట్టుంచుకోలేదని, కేసులు తగ్గుతున్నప్పుడు ఆకస్మాత్తుగా అంటున్నారని ఆక్షేపించింది. రెండో డోసు వ్యాక్సిన్ తీసుకునే వారిని లాక్డౌన్లో అనుమతించాలని ఆదేశించింది. సమయం ఇవ్వకుండా రేపట్నుంచి లాక్డౌన్ అని ప్రకటిస్తే.. వలస కూలీలు ఉన్నట్టుండి ఎలా వెల్తారని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గత ఏడాది పొరపాట్లు మళ్లీ చేస్తారా? అని ప్రశ్నించింది. దీనిపై ఏజీ ప్రసాద్ వివరణ ఇచ్చారు. ఇప్పటికే సగం మంది వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారని చెప్పారు. ఇక్కడ ఉన్నవారి బాగోగులను రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందని కోర్టుకు తెలిపారు.
సరిహద్దుల్లో అంబులెన్స్ అపొద్దంటూ హైకోర్టు ఆదేశాలు
ఇక రాష్ట్ర సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అంబులెన్స్లను అడ్డుకోవడంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా అంబులెన్స్లను ఆపడం రాజ్యాంగ విరుద్ధమని తెలుసా? అని ప్రశ్నించింది. సర్కూలర్, అడ్వైజరీ లేకుండా ఎలా నిలిపివేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. హైదరాబాద్ మెడికల్ హబ్ అని, ఇక్కడికి వైద్యం కోసం ఇతర రాష్ట్రాలవారు కూడా వస్తారని స్పష్టం చేసింది. అంతేగాక, సరిహద్దుల్లో అంబులెన్స్లు ఆపొద్దని పోలీసులను ఆదేశించింది. దీంతో సరిహద్దులోని అంబులెన్స్లు రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఏర్పడింది.
Recommended Video
మద్యం షాపులు అనుమతిస్తారా? లేక డోర్ డెలివరీకా?
ఇది ఇలావుండగా, తెలంగాణలో బుధవారం నుంచి లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో మద్యం దుకాణాలు తెరిచి ఉంచే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే మద్యం షాపుల వద్ద జనం బారులు తీరారు. కరోనా నిబంధనలను పక్కనే పెట్టి మద్యం షాపుల వద్ద గుమిగూడారు. కాగా, రేపట్నుంచి లాక్ డౌన్ అమల్లోకి రానున్న నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ మాత్రమే కార్యకలాపాలకు అవకాశం ఇవ్డంతో మద్యం దుకాణాలు ఎప్పుడు తెరవాలనే దానిపై ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. అబ్కారీ శాఖ నిబంధనల ప్రకారం బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు ఉదయం 10 గంటలలోపు తెరిచేందుకు అవకాశం లేదు. దీంతో అబ్కారీ శాఖ అధికారులు మద్యం దుకాణాలను తెరిచే అంశంపై ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. మినహాయింపు సమయంలో మద్యం అమ్మకాలకు అవకాశం ఇవ్వాలని లేదంటే డోర్ డెలివరీకి అనుమతివ్వాలని డిస్టలరీ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరుతోంది. దీనిపై తాజాగా ప్రభుత్వం నిర్ణయాన్ని వెల్లడించింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మద్యం షాపులు కూడా తెరచుకోవచ్చని స్పష్టం చేసింది.