కరోనా బులెటిన్ రోజూ విడుదల చేయాల్సిందే: తెలంగాణ సర్కాకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా హెల్త్ బులిటెన్ విషయంలో హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతిరోజూ కరోనా హెల్త్ బులిటెన్ తప్పకుండా ఇవ్వాల్సిందేనని తెలంగాణ సర్కారుకు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
కాగా, రాష్ట్రంలో గత రెండు రోజులుగా కరోనా హెల్త్ బులిటెన్ వివరాలు ఇవ్వకుండా అదికారులు నిలిపివేశారు. కరోనా తగ్గుతున్న క్రమంలో ఇకపై ప్రతిరోజు కాకుండా.. వారానికి ఒకసారి మాత్రమే కరోనా కేసులకు సంబంధించిన అప్డేట్ ఇస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
గురువారం ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు.. ప్రతిరోజు కరోనా బులిటెన్ విడుదల చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. అంతేగాక, వీలైనంత త్వరగా సీరం సర్వే చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్వే నివేదిక సిఫార్సులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
జనవరి 25 నుంచి ఫిబ్రవరి 12 వరకు చేసిన పరీక్షల వివరాలను నివేదిక రూపంలో తెలంగాణ సర్కారు హైకోర్టులో సమర్పించింది. కరోనా నిర్ధారణ కోసం 1,03,737 ఆర్టీపీసీఆర్, 4,83,266 యాంటీజెన్ పరీక్షలు చేశామని తెలిపింది.
గత జూన్ 3 నుంచి డిసెంబర్ వరకు 3 సార్లు సీరం సర్వేలు చేశామని హైకోర్టుకు ప్రభుత్వం వెల్లడించింది. దీనిపై స్పందిచిన హైకోర్టు.. రెండో దశ కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఈ సందర్బంగా హైకోర్టు పేర్కొంది.
కరోనా వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఫిబ్రవరి 26 నుంచి కరోనా బులిటెన్ రోజూ విడుదల చేయాలని స్పష్టం చేసింది. అంతేగాక, వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ విధానంపై విస్తృత ప్రచారం చేయాలని సూచించింది. తదుపరి విచారణను మార్చి 18కి వాయిదా వేసింది.