కరోనా టెస్టులు తగ్గించారెందుకు?: తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ సర్కారుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. కరోనాకు సంబంధించిన వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది.
ఏపీ పాజిటివ్.. కరోనా నెగిటివ్: రాష్ట్రంలో తగ్గుతున్న కొత్త కేసులు, మరణాలు
మహారాష్ట్రలో రోజుకు లక్షన్నర కరోనా పరీక్షలు చేస్తున్నారని వ్యాఖ్యానించిన హైకోర్టు.. తెలంగాణలో రోజుకు 40 వేల పరీక్షలు చేస్తామన్న హామీ ఎందుకు అమలు కావడం లేదని నిలదీసింది. కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారో తెలపాలని ఆదేశించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రమాణాలకు అనుగుణంగా ఆస్పత్రుల్లో బెడ్లు ఎందుకు లేవని, మిగితా రాష్ట్రాల కన్నా ఎందుకు వెనకబడి ఉన్నారో తెలపాలని తెలంగాణ సర్కారును ఆదేశించింది. వెయ్యి మందికి కనీసం మూడు బెడ్లు కూడా లేకపోవడానికి గల కారణాలు, ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ బెడ్లు పెంచే ప్రణాళికలు ఉన్నాయో లేవో తెలపాలని హైకోర్టు పేర్కొంది. ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనవాసరావు తండ్రి కరోనాతో మరణించినందున గడువు సమయం ఇవ్వాలని ఏజీ కోరారు. దీంతో హైకోర్టు విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. టెస్టులు పెద్ద సంఖ్యలో చేయకపోయినప్పటికీ.. చేసిన పరీక్షల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 1,79,246 కరోనా కేసులు నమోదు కాగా, 30,037 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 1,48,139 మంది కోలుకున్నారు. 1070 మంది మరణించారు. 26 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఇది ఇలావుండగా, న్యాయవాది గోపాల్ రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యంపైనా హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. అక్రమ లేఅవుట్లలో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంపై విచారణ జరిపింది. రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అక్టోబర్ 14లోపు కౌంటర్ దాఖలు చేయాలని సర్కారును ఆదేశించింది. విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది.