హైకోర్టు అన్లాక్ మార్గదర్శకాలు: ఇక తెలంగాణలో అన్ని కోర్టులు ఓపెన్
హైదరాబాద్: తెలంగాణలో ఇక అన్ని కోర్టులు తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలోని అన్ని కోర్టులు తెరిచేందుకు తెలంగాణ హైకోర్టు తాజాగా అనుమతులు జారీ చేసింది. డిసెంబర్ 31 వరకు న్యాయస్థానాలు అనుసరించాల్సిన అన్లాక్ విధానాలను హైకోర్టు వెల్లడించింది. హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాల్లో ఇప్పటికే భౌతికంగా కేసుల విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
అయితే, హైదరాబాద్ జిల్లాలోని సివిల్, క్రిమినల్ కోర్టులూ తెరవాలని తాజాగా ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు డిసెంబర్ 31 వరకు హైకోర్టులో ఆన్లైన్, భౌతిక విచారణ విధానమే కొనసాగించాలని నిర్ణయించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ వేగవంతం చేయాలని స్పష్టం చేసింది.
సీబీఐ, ఏసీబీ, ప్రత్యేక కోర్టులు.. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల ప్రత్యేక కోర్టులు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలనే కొనసాగించాలని పేర్కొంది. హైకోర్టు విధించిన గడువుకు కట్టుబడి విచారణ జరపాలంటూ హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 31 వరకు ప్రస్తుత ఆన్లైన్, భౌతిక విచారణ విధానమే కొనసాగించాలని సూచించింది.
ఇది ఇలావుంటే, తెలంగాణ కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,50,331 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,29,064 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 1377 మంది కరోనా బారినపడి మరణించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 19,890 యాక్టివ్ కేసులున్నాయి.