సచివాలయం కూల్చివేయొద్దు.. సర్కార్ ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్..!
హైదరాబాద్ : సచివాలయం కూల్చివేతపై విపక్షాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి. ప్రజా ధనం దుర్వినియోగం చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆమోద యోగ్యం కాదని ధ్వజమెత్తుతున్నాయి. ఈ క్రమంలో కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో డైలామాలో పడింది సర్కార్. అయితే సచివాలయం కూల్చివేయొద్దంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడం చర్చానీయాంశమైంది.
తెలంగాణ సచివాలయం ఇక ఫోటో ప్రదర్శనలకే..! కార్యకలాపాలకు నేడే చివరి రోజు..!!
ఒకవైపు మంత్రివర్గ సమావేశం కొనసాగుతుండగా న్యాయస్థానం ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేబినెట్ భేటీలో సచివాలయం శంకుస్థాపనకు ముహుర్తం ఖరారు చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు ట్విస్ట్ ఇచ్చినట్లైంది.
సచివాలయంను కూల్చివేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 14వ తేదీ వరకు కూల్చివేత ప్రక్రియకు పూనుకోవద్దని సూచించింది. దసరా సెలవుల తర్వాత మరోసారి విచారణ చేపడతామని స్పష్టం చేసింది న్యాయస్థానం.
తెలంగాణ సచివాలయం కూల్చివేత అంశం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. వాస్తు పేరిట సీఎం కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. చెక్కు చెదరని భవనాలను కూల్చడం వెనుక ఆంతర్యమేంటో ప్రజలు గమనిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతూనే ఉన్నారు. అదే క్రమంలో న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. ఆ క్రమంలో తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెక్ పెట్టినట్లైంది.