సైరాను ఆపలేం.. రిలీజ్ విషయంలో జోక్యం చేసుకోం: హైకోర్టు సంచలన తీర్పు
కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్పై సినీ హీరో రాంచరణ్ ప్రతిష్టాత్మకంగా సైరా నర్సింహారెడ్డి చిత్రానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి జీవిత చరిత్రను తెరకెక్కిస్తూ మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చరిత్రను వక్రీకరిస్తూ సైరా తీశారని ఉయ్యాలవాడ వారసులు, తమిళనాడు తెలుగు యువ సంఘం నాయకులు కేతి రెడ్డి జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ క్రమంలో తన తీర్పును వెల్లడిస్తూ సినిమా రిలీజ్ ఆపలేమని స్పష్టం చేసింది.
జోక్యం చేసుకోలేం
సైరా రిలీజ్ను ఆపాలంటూ దాఖలు చేసిన పిటిషన్ విచారించిన తెలంగాణ కోర్టు స్పందిస్తూ.. తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా సినిమాను వినోదపరంగా చూడాలి. మహానుభావుల చరిత్రను ఉన్నది ఉన్నట్టు చూపించడం సాధ్యం కాదు అని న్యాయమూర్తి వాఖ్యలు చేసినట్టు తెలిసింది. గతంలో చరిత్ర ఆధారంగా వచ్చిన చిత్రాల్లో కూడా ఇదే స్పష్టమైంది అని పేర్కొన్నారు.
తప్పుదోవ పట్టిస్తున్నారని పిటిషన్
సైరా బయోపిక్ అని చెప్పి.. ఇప్పుడు చరిత్ర అని తప్పుదోవ పట్టిస్తున్నారని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ను టీఎస్ కోర్టు తోసిపుచ్చినట్టు సమాచారం. గతంలో గాంధీ, మొగల్ సామ్రాజ్యాన్ని తెరకెక్కించిన చిత్రాలను ఈ సందర్భంగా పిటిషన్ దారుల దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. దీంతో సైరా రిలీజ్ అడ్డు తొలిగినట్టు అయింది.
ప్రేక్షకులకు వదిలేయండి
సినిమా కేవలం వినోద పరంగా చూడాలి. సినిమా నచ్చేది.. నచ్చనిది ప్రేక్షకులకే వదలేయాలి. ఈ దశలో సినిమాను ఆపలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సైరా సినిమాపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్కు మార్గం సుగమమైంది.
అక్టోబర్ 2వ తేదీన
సైరా చిత్రంలో బిగ్ బీ అమితాబ్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, నయన తార, తమన్నా, జగపతి బాబు లాంటి ఎంతో మంది భారీ తారాగణంతో తెరకెక్కించారు. ముంబై, బెంగళూరు, చెన్నైలో ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేసిన చిత్రయూనిట్.. అక్టోబర్ 2న సినిమాను విడుదల కానున్నది.