ఆ ఇద్దరు కలెక్టర్లకు మూడు నెలల జైలు శిక్ష... తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు...
కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇద్దరు కలెక్టర్లు,ఓ అధికారికి మూడు నెలల జైలు శిక్ష విధించింది. ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ డి.కృష్ణ భాస్కర్, వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా,భూసేకరణ అధికారి ఎన్.శ్రీనివాసరావు శిక్ష పడినవారిలో ఉన్నారు. ప్రాజెక్టు కోసం సేకరించిన భూములకు పరిహారం చెల్లించేంతవరకూ వాటిని ముంపుకు గురికాకుండా చూడాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించిన కేసులో న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది.
ఇవీ కేసు వివరాలు...
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం అనంతగిరి సమీపంలో చేపట్టిన అనంతగిరి రిజర్వాయర్ కోసం జిల్లా కలెక్టర్ డి.కృష్ణ భాస్కర్,అప్పటి జాయింట్ కలెక్టర్ యాస్మిన్ భాషా,భూసేకరణ అధికారి ఎన్.శ్రీనివాసరావు భూసేకరణ చేపట్టారు. ఇందుకోసం అనంతగిరి గ్రామానికి చెందిన ఉమ్మెంతల ముత్తారెడ్డి, మరో 10 మంది రైతుల నుంచి భూములు, ఇళ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే ఇళ్లకు మాత్రమే పరిహారం చెల్లించిన ప్రభుత్వం భూములకు పరిహారం చెల్లించలేదని రైతులు గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
గతంలో కోర్టు ఆదేశాలు...
అప్పట్లో రైతుల పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించేంతవరకూ ఆ భూములను స్వాధీనం చేసుకోవద్దని ఆదేశించింది. అప్పటివరకూ ఆ భూములు ప్రాజెక్టు కింద ముంపుకు గురికాకుండా చూడాలని ఆదేశించింది. అయితే అధికారులు ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. అనంతగిరి రిజర్వాయర్ నిర్మాణం పూర్తయ్యాక నీటిని కిందకు విడుదల చేయడంతో ఆ భూములన్నీ ముంపుకు గురయ్యాయి.
కోర్టు ధిక్కరణ కింద జైలు శిక్ష
ఈ నేపథ్యంలో రైతులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. అధికారులపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దీనిపై బుధవారం(మార్చి 3) కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తమ వాదన వినిపించిన కలెక్టర్లు... నిజానికి ఆ భూములు నీట మునగలేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఆ వాదనతో ఏకీభవించని కోర్టు న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఉద్దేశపూర్వకంగా కోర్టు తీర్పును అమలుచేయలేదన్న కారణంతో ఇద్దరు కలెక్టర్లు,మరో అధికారికి హైకోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే పిటిషన్ దాఖలు చేసిన 11 మంది రైతులకు ఒక్కొక్కరికి ఖర్చుల కింద రూ.10వేల చొప్పున చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. శిక్షపై అప్పీల్ చేసుకోవడానికి అధికారులకు కోర్టు ఆరువారాల గడువు ఇచ్చింది. దీంతో అప్పటివరకూ శిక్షను అమలు చేయరు. అదే సమయంలో ఈ తీర్పును అధికారుల సర్వీస్ రికార్డుల్లో నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.