తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు...
తెలంగాణ ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ను నిలిపివేయాలని హైకోర్టు జేఎన్టీయూని ఆదేశించింది. నిబంధనల ప్రకారం.. ఎంసెట్ పరీక్ష రాయాలంటే ఇంటర్లో కనీసం 45శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం... పాస్ మార్కులు(35) వేసి అందరినీ ఉత్తీర్ణులను చేసింది. అయితే ఇక్కడే సమస్య వచ్చి పడింది.
ఇంటర్మీడియట్కు పాస్ మార్కులు ఇచ్చిన ప్రభుత్వం ఎంసెట్ రాయాలంటే ఇంటర్మీడియట్లో 45శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను విస్మరించింది. దీంతో అడ్వాన్స్ సప్లిమెంటరీలో ఎక్కువ మార్కులు తెచ్చుకుని ఎంసెట్కు అర్హత సాధించాలన్న విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. దీంతో చాలామంది విద్యార్థులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో బాధిత విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించడంతో... ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ను నిలిపివేయాలని జేఎన్టీయూని హైకోర్టు ఆదేశించింది.
అదే సమయంలో దీనిపై ప్రభుత్వ వివరణ కోరగా... త్వరలోనే ఎంసెట్ నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేస్తుందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. దీంతో జీవో వచ్చేంతవరకు కౌన్సెలింగ్ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ ఏడాది ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలకు మొత్తం 4.11 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఎంపీసీ,బైపీసీ విద్యార్థులు 2,83,631 మంది ఉన్నారు. ఇందులో 1.75లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే ఎంసెట్కు కావాల్సిన 45శాతం కనీస మార్కులు పొందనివారికి... అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల రూపంలో మరో అవకాశం ఉండేది. అందులో స్కోర్ పెంచుకుంటే ఆ తర్వాత ఎంసెట్కు అర్హత సాధించేవారు. కానీ ఈసారి ప్రభుత్వం కనీస మార్కులు 35తో ఫెయిలైనవారిని పాస్ చేయడంతో చాలామంది ఎంసెట్కు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్న విమర్శలున్నాయి.