ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలపై ఉత్కంఠ.. కోర్టు గడువు ముగిసినా స్పందన కరువు
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఏ ముహుర్తాన విడుదల చేశారో గానీ రచ్చ రచ్చయింది. ఫలితాలు తప్పుల తడకగా మారడంతో గందరగోళం నెలకొంది. మొత్తానికి కోర్టు జోక్యంతో తెలంగాణ ప్రభుత్వం రీవెరిఫికేషన్ ఫ్రీగా చేయిస్తానని హామీ ఇచ్చింది. అంతవరకు బాగానే ఉన్నా.. ఫలితాల విడుదలలో జాప్యం జరగడం మాత్రం విద్యార్థులను అయోమయానికి గురిచేస్తోంది.
ఇంటర్మీడియట్ రీవెరిఫికేషన్ ఫలితాల వెల్లడిపై ఇంకా టెన్షన్ వాతావరణమే కనిపిస్తోంది. ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఫలితాలు వెల్లడించాలని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు హైకోర్టు గడువు ఇచ్చింది. అది కాస్తా ఇవాళ్టితో ముగియడంతో ఫలితాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసినా కూడా అధికారులు ఫలితాలను వెల్లడించకపోవడం గమనార్హం.
కేసీఆర్కు సగం తగ్గింది.. అది పూర్తిగా తగ్గాలి.. వెంకన్నకు వీహెచ్ మొక్కులు..!
సోమవారం (27.05.2019) సాయంత్రం 5 గంటలకు హైకోర్టు ఇచ్చిన గడువు ముగియడం.. అధికారులు ఫలితాలు వెల్లడించకపోవడం.. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 5 గంటల వరకు ఎదురుచూసినప్పటికీ రీవెరిఫికేషన్ ఫలితాలు రాకపోవడం వారిని అయోమయానికి గురిచేస్తోంది. అదలావుంటే ఫలితాల వెల్లడిపై ఇంతవరకు బోర్డు అధికారులు నోరు మెదపకపోవడం మరింత గందరగోళానికి కారణమవుతోంది.
2018-19 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి వెల్లడించిన ఫలితాల్లో 3,82,116 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. దాంతో పెద్దఎత్తున గందరగోళం చోటుచేసుకోవడంతో అధికారులు రీవెరిఫికేషన్ చేయించారు. అందులో 92,429 మంది విద్యార్థుల సమాధాన పత్రాలు తిరిగి వాల్యూయేషన్ చేయించారు. వాటికి సంబంధించిన ఫలితాలు వెల్లడించాల్సి ఉన్నా.. బోర్డు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరోవైపు అకాడమిక్ ఇయర్ ప్రారంభం కావడానికి సమయం సమీపిస్తుండటంతో ఫలితాల కోసం వేచిచూస్తున్న విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు.