తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం.. రెండో పెళ్లికి కూడా ఆర్థిక సాయం
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర ఖజానా లోటు బడ్జెట్తో కొట్టుమిట్టాడుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో.. తాజాగా తీసుకున్న నిర్ణయం చర్చానీయాంశమైంది. కల్యాణ లక్ష్మి పథకం కింద పేద కుటుంబాలకు లక్ష నూట పదహారు రూపాయలు ప్రభుత్వం అందిస్తోంది. అదలావుంటే ఇకపై రెండో పెళ్లికి కూడా ఆర్థిక సాయం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రెండో పెళ్లికి కూడా కల్యాణ లక్ష్మి సాయం
తెలంగాణలో నివసించే నిరుపేద దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ, మైనార్టీ కులాలకు చెందిన యువతుల పెళ్లిళ్ల కోసం లక్ష నూట పదహారు రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన ప్రారంభంలోనే ఈ పథకాన్ని తెరపైకి తెచ్చారు సీఎం కేసీఆర్. పేద కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లి చేయడం భారంగా ఉంటుందని భావించిన ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అమలు చేస్తోంది.
2014, అక్టోబర్ 2వ తేదీన ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ కింద పెళ్లి చేసుకునే ఆడపిల్లలకు 51వేల రూపాయల ఆర్థిక సాయం అందించింది. 2017-18 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆ మొత్తాన్ని కాస్తా 75 వేల 116 రూపాయలకు పెంచారు. అనంతరం 2018, మార్చి నెలలో మరోసారి పెంచుతూ లక్ష నూట పదహార్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆ మేరకు అప్పటినుంచి పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వం సవరించిన మొత్తం అందిస్తోంది.
500 కోట్లు, సకల సౌకర్యాలు.. అసెంబ్లీ, సెక్రటేరియట్ కొత్త భవనాలకు భూమిపూజ.. భగ్గుమన్న బీజేపీ
లక్ష నూట పదహార్లు.. కండిషన్స్ అప్లై
పెళ్లైన తరువాత విడాకులతోనో, భర్త చనిపోతేనో లేదంటే ఇతరత్రా కారణాలతో భర్తతో వేరుగా ఉండే పేద యువతులకు అండగా నిలబడేందుకు మరోసారి ప్రభుత్వం ముందుకొచ్చింది. అలాంటివారు రెండో వివాహం చేసుకోవాలని భావిస్తే కల్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సాయం అందించనుంది. అయితే ఇక్కడ ఓ మెలిక ఉంది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద అప్పటివరకు లబ్ధిపొందనివారికే ఈ అవకాశం దక్కనుంది. ఆ మేరకు బీసీ సంక్షేమ కార్యదర్శి బి.వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులే కారణమన్నారు. సిద్దిపేట జిల్లా పోతపల్లికి చెందిన పి.చిరంజీవి ప్రభుత్వానికి ఈ సూచన చేసినట్లు తెలిపారు. ఆ మేరకు విధివిధానాలు రూపొందించి రెండో పెళ్లికి కూడా ఆర్థికసాయం అందించేలా కసరత్తు చేసినట్లు చెప్పారు.
3 లక్షల మందికి పైగా లబ్ధి
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద లబ్ధి పొందిన కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బంధుమిత్రులు, ఇరుగుపొరుగు ఎవరూ ఒక్క రూపాయి సాయం చేయకున్నా.. ప్రభుత్వం అందిస్తున్న లక్ష నూట పదహరు రూపాయల ప్రభుత్వ సాయం తల్లిదండ్రుల భారం దించుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ పథకం ద్వారా 2018, మార్చి నాటికి 3 లక్షల 65 వేల మందికి లబ్ధి చేకూరడం విశేషం.