అమితాబ్ బచ్చన్కు షాక్ ఇచ్చిన కూకట్పల్లి కోర్టు: ఆ మూవీపై స్టే: ఓటీటీలోనూ నో స్ట్రీమింగ్
హైదరాబాద్: బాలీవుడ్ సూపర్స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన సినిమా విడుదల, ప్రదర్శనకు బ్రేక్ పడింది. ఇక ఆ మూవీ ఓవర్ ద టాప్ (ఓటీటీ) ప్లాట్ఫామ్లపైనా స్ట్రీమ్ కాకపోవచ్చు. సుమారు ఏడాదికాలంగా కాపీరైట్ వివాదంలో నడుస్తోన్న ఆ సినిమా విడుదలకు న్యాయస్థానం స్టే ఇచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ కూకట్పల్లి న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసింది. విదేశాల్లో కూడా ఆ సినిమా స్ట్రీమింగ్ను నిలిపివేయాలని పేర్కొంది. ఆ మూవీ- ఝుండ్.
అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్లో చేసిన మూవీ అది. ఫుట్బాల్ కోచ్గా నటించారు. స్పోర్ట్స్ జానర్లో తెరకెక్కింది. స్లమ్ సాకర్ ఛాంపియన్ అఖిలేశ్ పాల్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని కథను అల్లుకున్నారు. సైరత్తో మరాఠీ ఫిల్మ్ ఇండస్ట్రీలో చెరిగిపోని రికార్డును నెలకొల్పిన నాగరాజ్ పోపట్రావ్ మన్జులే ఈ మూవీ దర్శకుడు. సైరత్.. వంద కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన తొలి మరాఠీ మూవీ. ఆయన దర్శకత్వం వహించిన ఝుండ్ మూవీ విడుదలకు సిద్ధమవుతున్న వేళ.. కాపీరైట్స్ వివాదాల్లో చిక్కుకుంది.
ఈ సినిమా కాపీరైట్స్ తన దగ్గర ఉన్నాయని మియాపూర్కు చెందిన ఫిల్మ్మేకర్ డాక్టర్ నంది చిన్నికుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాపీరైట్స్ తన వద్ద ఉన్నాయంటూ పిటీషన్ దాఖలు చేశారు. కూకట్పల్లి న్యాయస్థానం దీన్ని విచారణకు స్వీకరించింది. నిర్మాత, దర్శకుడు నాగరాజ్, టీ సిరీస్ ఛైర్మన్ భూషణ్ కుమార్, లీడ్ రోల్లో నటించిన అమితాబ్ బచ్చన్లకు ఇదివరకే నోటీసులను జారీ చేసింది.
ఏడాదికాలంగా ఈ విచారణ కొనసాగుతోంది. తాజాగా కూకట్పల్లి న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. సినిమా ప్రదర్శన, విడుదలపై స్టే ఇచ్చింది. ఓటీటీ ప్లాట్ఫామ్లపైనా స్ట్రీమింగ్ చేయొద్దని ఆదేశించింది. టీ-సిరీస్ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ వాదన మరోలా ఉంది. తాను 2017లోనే ఈ మూవీ హక్కులను కొనుగోలు చేశానని చెబుతున్నారు. స్లమ్ సాకర్ ఆటగాడు, హోమ్లెస్ వరల్డ్ కప్ టీమ్ కేప్టెన్ నుంచి తాను కాపీరైట్స్ను తీసుకున్నానని అంటున్నారు.
Recommended Video
దాదాపు ఇదే తరహా వాదనను నంది చిన్నికుమార్ కూడా వినిపిస్తున్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ మురికివాడల్లో జన్మించిన అఖిలేష్ జీవిత కథ ఆధారంగా స్లమ్ సాకర్ అనే బైలింగ్వల్ ఫిల్మ్ను రూపొందించుకోవడానికి తాను కాపీరైట్స్ తీసుకున్నానని, దాన్నే ఝుండ్గా తీశారని చెబుతున్నారు. చివరికి- ఈ మూవీ విడుదల, ప్రదర్శనపై స్టే వచ్చింది.