హైదరాబాద్లో హైటెన్షన్: చార్మినార్ సహా: పలు ప్రాంతాల్లో మోహరించిన పోలీసు బలగాలు
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం 10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ ఉదయం 10 గంటలకు లాక్డైన్ ఆరంభమైంది. ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగుతుంది. లాక్డౌన్ సందర్భంగా కొన్ని అత్యవసర సర్వీసులు మినహా మరే ఇతర సేవలకూ అనుమతించట్లేదు. రంజాన్ పండుగ ఉన్నప్పటికీ.. మసీదుల్లో సామూహిక ప్రార్థనలను నిర్వహించడాన్నీ నిషేధించింది. ఇంట్లోనే ప్రత్యేక ప్రార్థనలను జరుపుకోవాలంటూ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
చార్మినార్ వద్ద భారీ భద్రత..
అటు లాక్డౌన్..ఇటు రంజాన్ ప్రత్యేక ప్రార్థనలను పురస్కరించుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. పలు ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరింపజేశారు. హైదరాబాద్ సిటీ సౌత్ జోన్ కమిషనరేట్ పరిధిలోని చార్మినార్ వద్ద అశ్విక దళాలను మోహరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ స్వయంగా చార్మినార్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితులను సమీక్షించారు. అదనపు పోలీస్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) డీఎస్ చౌహాన్ అక్కడే మకాం వేశారు.
బోసిపోయిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్..
వేలాదిమంది రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, పరిసర ప్రాంతాలన్నీ లాక్డౌన్ వల్ల బోసిపోయి కనిపించాయి. దుకాణదారులు, తోపుడుబండ్లు, వీధి వ్యాపారులను పోలీసులు ఖాళీ చేయించారు. రైల్వేస్టేషన్కు చేరుకున్న ప్రయాణికుల టికెట్లను పరిశీలించిన అనంతరం వారిని అనుమతి ఇచ్చారు. సిటీ బస్సులేవీ రోడ్లెక్కలేదు. మోండా మార్కెట్, క్లాక్ టవర్, పాత గాంధీ ఆసుపత్రి ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. సిటీబస్సులు అందుబాటులో లేకపోవడంతో అప్పుడే రైల్వేస్టేషన్లకు చేరుకున్న ప్రయాణికులు ఆటోలను ఆశ్రయించడం కనిపించింది.
ఎల్బీనగర్ కట్టుదిట్టం..
మరోవంక హైదరాబాద్-విజయవాడ ప్రధాన రహదారిని పోలీసులు పాక్షికంగా మూసివేశారు. ఎల్బీనగర్, కొత్తపేట్ వద్ద రోడ్డు అడ్డుగా బ్యారికేడ్లను అమర్చారు. వాహనాలను తనిఖీ చేసిన తరువాత పంపిస్తున్నారు. తొలిరోజు కావడం వల్ల హైదరాబాద్లో నివసించే పలువురు తమ స్వస్థలాలకు తిరుగుముఖం పట్టారు. అందుబాటులో ఉన్న వాహనాల్లో వారు స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు. ఫలితంగా- అటు కుషాయిగూడ, ఇటు ఎల్బీనగర్, బహదూర్ పురా, ఆరంఘర్ ప్రాంతాలు రద్దీగా కనిపించాయి. బస్సులు లేకపోవడం వల్ల టెంపోలు, మినీ లారీలు, ఇతర ప్రైవేటు వాహనాల్లో స్వస్థలాలకు తరలి వెళ్తున్నారు.
Recommended Video
అయిదు లక్షలకు పైగా..
తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసులు అయిదు లక్షలను దాటేసిన విషయం తెలిసిందే. మంగళవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,801 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 32 మరణించారు. 7,430 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,06,988కి చేరుకుంది. ఇందులో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, ఇళ్లకు వెళ్లిన వారు 4,44,049 మంది ఉన్నారు. 2,803 మంది మృత్యువాత పడ్డారు. తాజా బులెటిన్ ప్రకారం.. 60,136 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి.