కరోనా : మంచి కబురు చెప్పిన ఈటెల.. కానీ లైట్ తీసుకోవద్దని హెచ్చరిక..
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులన్నీ బయట నుంచి వచ్చినవారివి.. లేదా వారి కాంటాక్ట్లో ఉన్నవారివేనని ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చినవాళ్లు,మర్కజ్ వెళ్లి వచ్చినవారి వల్లే పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదన్నారు. ఇప్పటినుంచి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ ఏప్రిల్ 24 వరకు ఇప్పుడున్న పాజిటివ్ పేషెంట్లు కూడా కోలుకుని డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందన్నారు. అయితే కేసుల సంఖ్య తగ్గుతోందని తేలిగ్గా తీసుకోవద్దని.. ఇప్పటివరకు ఉన్న కమిట్మెంట్నే ఇకపై కూడా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
కేసులు వివరాలు
తెలంగాణలో గురువారం(ఏప్రిల్ 9)న మొత్తం 665 కరోనా టెస్టులు చేయగా.. కేవలం 18 మందికి మాత్రమే వైరస్ పాజిటివ్గా తేలిందన్నారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 471 కి చేరిందని.. ఇందులో మర్కజ్ కేసులే 388 ఉన్నాయని తెలిపారు. మర్కజ్ వెళ్లి వచ్చినవారి కాంటాక్ట్స్ ద్వారా వైరస్ సోకినవారు కొంతమంది ఉన్నట్టు చెప్పారు. కరోనా ప్రభావంతో ఇప్పటివరకు 12 మంది మృతి చెందినట్టు తెలిపారు. మొత్తం 471 మందిలో 414 మంది పేషెంట్స్ గాంధీ,కింగ్ కోఠి,చెస్ట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు.
ఏప్రిల్ 22 వరకు కరోనా ఫ్రీ స్టేట్ అయ్యే ఛాన్స్
మార్చి 25,26,27 తేదీల్లో ఆసుపత్రుల్లో చేరిన మర్కజ్ కేసులు కూడా శుక్రవారంతో 14 రోజులు పూర్తి చేసుకుని డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని తెలిపారు. వారి రిపోర్ట్స్ ఈ రాత్రికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కరోనా పాజిటివ్ పేషెంట్లలో ఇప్పటికే 45 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. ఎలాగైతే క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతూ వచ్చాయో.. మళ్లీ అలాగే క్రమంగా అవన్నీ నెగటివ్గా తేలే అవకాశం ఉందన్నారు. ఏప్రిల్ 22 వరకు ఇప్పుడున్న పేషెంట్లంతా కోలుకుని తెలంగాణ కరోనా ఫ్రీ స్టేట్గా మారే అవకాశం ఉందన్నారు. నిజానికి మర్కజ్ కేసులు గనుక లేకపోతే సీఎం కేసీఆర్ చెప్పినట్టు ఈపాటికే రాష్ట్రం మర్కజ్ ఫ్రీ అయ్యేదన్నారు.ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారిలో అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. కేవలం ఒక్కరు మాత్రమే వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని చెప్పారు.
హాట్ స్పాట్ల గుర్తింపు.. కంటైన్మెంట్కు చర్యలు..
గాంధీ ఆసుపత్రి డాక్టర్లు,సిబ్బంది పేషెంట్లను కంటికి రెప్పలా చూసుకుంటున్నారని చెప్పారు. మర్కజ్ వెళ్లి వచ్చినవారిని.. వారి కాంటాక్ట్స్ను దాదాపుగా గుర్తించి క్వారెంటైన్ చేశామని... కాబట్టి కొత్తగా వచ్చే పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగానే ఉండవచ్చునని అన్నారు. అలా అని ప్రజలు తేలిగ్గా తీసుకోవడానికి లేదని.. ఇంతకుముందు ఎలాంటి నిబద్దతతో లాక్ డౌన్ పాటించారో... ఇప్పుడు కూడా అదే నిబద్దతతను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. మర్కజ్ కేసులు రావడం,లాక్ డౌన్ ప్రకటించడం రెండూ ఒకే సమయంలో జరిగాయి కాబట్టే పాజిటివ్ కేసులు అదుపులో ఉన్నాయని చెప్పారు. వైరస్ వ్యాప్తికి అవకాశం ఉండే 101 హాట్ స్పాట్లను గుర్తించి.. ఆయా ప్రాంతాల్లో కంటైన్మెంట్ చర్యలు తీసుకోబోతున్నట్టు చెప్పారు. ఆ ప్రాంతాల్లో నిత్యావసరాలను కూడా అధికారులే ఇళ్ల వద్దకు పంపిణీ చేస్తారని చెప్పారు.
Recommended Video
తలసేమియా.. డయాలసిస్ పేషెంట్లను ఆదుకునేందుకు..
గాంధీ ఆసుపత్రిలో ఓపీని పూర్తిగా మూసివేశామని.. కాబట్టి ఎవరైనా అనారోగ్యంతో బాధపడేవారు కింగ్ కోఠి ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. జలుబు,దగ్గు,గొంతు నొప్పితో బాధపడేవారు ఇప్పటికైనా ఆసుపత్రులకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలన్నారు. జిల్లాల్లో కలెక్టర్లు,ఎస్పీలు,హెల్త్ వర్కర్ల నేత్రుత్వంలో పకడ్బందీగా అన్ని చర్యలు అమలవుతున్నాయని చెప్పారు. హైదరాబాద్లో ప్రజలను మరింత ఎడ్యుకేట్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక కరోనా లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో ఉన్న 1500 మంది తలసేమియా వ్యాధి గ్రస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. రక్తదాతలు ముందుకు వచ్చి వారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. 108,104 నెంబర్ల ద్వారా దాతలు తమను సంప్రదిస్తే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో 10వేల పైచిలుకు మంది నెలకు 10సార్లు డయాలసిస్ చేయించుకునే పేషెంట్లు ఉన్నారని.. వారి కోసం కూడా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎవరికీ ఏ ఇబ్బంది ఉన్నా ప్రభుత్వానికి తెలియజేస్తే అన్ని విధాలా ఆదుకునే ప్రయత్నం చేస్తామన్నారు. ఒకవేళ కుటుంబ పెద్ద ఎవరైనా క్వారెంటైన్ కేంద్రంలో ఉండి ఇల్లు గడవడం కష్టంగా ఉంటే.. వారికి కూడా ప్రభుత్వం సాయం అందిస్తుందన్నారు. త్వరలోనే ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ను ఏర్పాటు చేసి ఇతరత్రా వ్యాధులతో బాధపడేవారికి టెలీ మెడిసిన్ ఇప్పించే ఏర్పాట్లు చేస్తామన్నారు. అలాగే లాక్ డౌన్ కారణంగా డిప్రెషన్తో బాధపడేవారికి కూడా సైక్రియాటిక్స్తో కౌన్సెలింగ్ ఇప్పిస్తామన్నారు.