బెంగళూరులో హింసపై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్: నెటిజన్లకు ఏం చెప్పారంటే
కర్ణాటకలో డీజే హళ్లిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి నివాసం వద్ద దాడులకు పాల్పడిన అల్లరిమూకలు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే నివాసం మీదనే కాకుండా,డీజే హళ్లి, కేజీ హళ్లి పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి,వాహనాలను దగ్ధం చేసి ,ముగ్గురి మరణానికి కారణమైన ఈ హింస ఘటనపై తెలంగాణ ఐటి మరియు మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ఫేక్ వార్తలను వ్యాప్తి చేయడం ఎంత ప్రమాదకరమో చెప్పిన మంత్రి కేటీఆర్
ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్ మీడియాలో ఫేక్ వార్తలను వ్యాప్తి చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటననే నిదర్శనం అని పేర్కొన్నారు. అందుకే సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న నెటిజన్స్ అందరూ బాధ్యతాయుతంగా మెలగాలని ఆయన ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేశారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్ సోషల్ మీడియాలో ఒక కమ్యూనల్ పోస్ట్ షేర్ చేయగా దాంతో వివాదం నెలకొని హింసకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే కేటీఆర్ ఈ విజ్ఞప్తి చేశారు .
కర్ణాటకలో జరిగిన హింసకు సోషల్ మీడియా పోస్ట్ కారణం
కర్ణాటకలో జరిగిన హింస ఘటనలో ముగ్గురు మృతి చెందగా,60 మంది గాయాలపాలయ్యారు. ఇప్పటివరకు పోలీసులు ఈ కేసులో 110 మందికి పైగా అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టు పెట్టిన ఎమ్మెల్యే బంధువు నవీన్ను కూడా అరెస్టు చేశామని సీపీ చెప్పారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు చెప్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం డీజే హళ్లి, కేజీ హళ్లిలో కర్ఫ్యూ అమల్లో ఉందని సీపీ కమల్ పంత్ పేర్కొన్నారు . ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితి సమీక్షిస్తున్నారు.
Recommended Video
అసాంఘిక చర్యలు రెచ్చగొట్టే సాధనంగా సోషల్ మీడియాను వాడొద్దు : కేటీఆర్
ఈ హింస ఘటన నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వినియోగదారులకు అసాంఘిక చర్యలు రెచ్చగొట్టే సాధనంగా సామాజిక మాధ్యమాలను వాడొద్దని, నకిలీ వార్తలు ప్రచారం చేయొద్దని అభ్యర్థించారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు సోషల్ మీడియా ఒక సాధనంగా మారకూడదని కేటీఆర్ పేర్కొన్నారు . కేవలం ఒక సోషల్ మీడియా పోస్ట్ తోనే కర్ణాటక రాష్ట్రంలో ఊహించని విధంగా హింస చెలరేగిన ఈ కారణంగానే కేటీఆర్ సోషల్ మీడియా యూజర్లను బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.