టీడీపీకి భవిష్యత్ లేదన్న తెలంగాణా మంత్రి తలసాని .. కారణాలు కూడా చెప్పారుగా
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టార్గెట్ గా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. టీడీపీకి భవిష్యత్ లేదని మంత్రి తలసాని పేర్కొన్నారు. ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఆయన వాగ్బాణాలు సంధిస్తున్నారు. ఎక్కడ వీలైతే అక్కడ తిట్ల దండకం చదువుతున్నాడు . కేసీఆర్ పేరును నిద్రలో కూడా తలుచుకుంటున్నారని ఎద్దేవా చేసిన తలసాని చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేసి దెబ్బ తిన్నారని పేర్కొన్నారు .
ఏపీ అసెంబ్లీపై వర్మ షాకింగ్ ట్వీట్.. స్పీకర్ హెడ్ మాస్టర్ , ఎమ్మెల్యేలు స్కూల్ పిల్లల్లట
చంద్రబాబుకు వయసైపోయిందన్న తలసాని శ్రీనివాస్ యాదవ్
గత ఐదేళ్ళ పాటు రాక్షస పాలన చేసి ఇప్పుడు గింజుకుంటే లాభం ఏం ఉంటుందని ఆయన అన్నారు. ఓ టీవీ చానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్ చంద్రబాబు ఓటమికి గల కారణాలను వివరించారు. గతంలో చంద్రబాబుకు ఇప్పుడు చంద్రబాబుకు చాలా తేడా ఉందని చెప్పిన తలసాని శ్రీనివాస్ యాదవ్ చంద్రబాబుకు వయసైపోయిందని వ్యాఖ్యానించారు. ఇక టీడీపీ ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ టీడీపీ అధికారంలో ఉన్న అన్ని రోజులు కార్యకర్తలను పట్టించుకోలేదని, కాంగ్రెస్ తో పొత్తు కూడా టీడీపీకి నష్టం చేసిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ తో పొత్తు , అనాలోచిత నిర్ణయాలు టీడీపీ ఓటమికి కారణం అన్న తలసాని
కాంగ్రెస్ పార్టీతో పొత్తును టీడీపీ కార్యకర్తలు ఎవరూ జీర్ణించుకోలేకపోయారని తెలిపారు. చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలు, అవినీతి, అక్రమాలు చంద్రబాబును గద్దె దించాయని తలసాని అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా ఒకప్పుడు క్యాడర్ ఫీడ్ బ్యాక్ తీసుకుని నిర్ణయాలు తీసుకునే చంద్రబాబు ఇప్పుడు టెక్నాలజీని నమ్ముకోవటం వల్లే కొంప మునిగిందని ఆయన అన్నారు.
తెలంగాణా వేలు పెట్టి రిటర్న్ గిఫ్ట్ తీసుకున్నాడన్న తలసాని
ఇక ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా టీడీపీకి భవిష్యత్ ప్రశ్నార్ధకంగా ఉందని పార్టీ మనుగడ కష్టమే అని తలసాని పేర్కొన్నారు. చంద్రబాబు రాజకీయాల్లో సుదీర్ఘ ప్రయాణం చేశారని , ఇప్పటికే చాలా సీనియర్ అని ఈ కాలపు రాజకీయాలు ఇక ఆయన వల్ల కాదని తలసాని అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అంటూ పోటీ చేసి తెలంగాణా లో వేలు పెట్టిన చంద్రబాబుకు ఏపీలో జగన్ తో కలిసి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని తలసాని వ్యాఖ్యానించారు. మొత్తంగా టీడీపీ భవిష్యత్ కష్టం అని తలసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.