తెలంగాణ జలీల్ ఖాన్.. బీకామ్ ఫిజిక్స్ను తలదన్నిన రాజకీయ వారసుడు..!
Recommended Video
హైదరాబాద్ : రాజకీయ నేతల వారసులు దూసుకొస్తున్నారు. బీకామ్లో ఫిజిక్స్ చదివిన ఏపీ జలీల్ఖాన్ను మించిన యువనేతలు వస్తున్నారు. తెలిసి తెలియని సొల్లంతా కక్కేసి ప్రజా సేవ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ జెండాలు మోయకుండానే.. వారసత్వపు అండదండలతో ప్రజాప్రతినిధులుగా రాజ్యమేలేందుకు రెడీ అవుతున్నారు. ప్రజా సమస్యలపై పట్టు లేకుండానే.. ఆయా అంశాలపై అవగాహన పొందకుండానే.. పొలిటికల్ కెరీర్ను పదిలం చేసుకునే ఛోటా లీడర్లు బడా నేతలుగా ఎదిగేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆ క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుత్రరత్నం సాయికిరణ్ యాదవ్ బీకామ్లో ఫిజిక్స్ చదివిన జలీల్ఖాన్లాగా సోషల్ మీడియాకు అడ్డంగా దొరికిపోయి నవ్వులపాలయ్యారు.
మరో జలీల్ ఖాన్.. కొత్త భాష్యం ఇలా..!
గోదావరి నది ఎక్కడ నుంచి మొదలవుతుందని ఐదో తరగతి చదువుకునే పిల్లోడిని అడిగినా కరెక్ట్ సమాధానం ఇస్తాడు. మరి యువనేతగా రాణించాలని కలలుగంటున్న మంత్రి తలసాని పుత్రరత్నం అలా సెలవిచ్చారేంటి. బీకామ్లో ఫిజిక్స్ చదివానంటూ అప్పట్లో సంచలనంగా మారిన ఆంధ్రప్రదేశ్ జలీల్ఖాన్ను మించి గోదావరి పారే తీరుకు కొత్త భాష్యం చెప్పారేంటి. ఇదంతా ఏంటనే కదా మీ డౌట్. ఇప్పుడు మ్యాటర్లోకి వెళితే ఆలుగడ్డ శీనన్నా అలియాస్ మంత్రి తలసాని కొడుకు ఏం మాట్లాడారో, సోషల్ మీడియాకు ఎలా అడ్డంగా దొరికిపోయారో తెలిసిపోతుంది.
ఇటీవల ప్రముఖ యూట్యూబ్ ఛానల్ తలసాని సాయికిరణ్ యాదవ్ను ఇంటర్వ్యూ చేసింది. ఆ క్రమంలో ఈ యువనాయకుడు బొక్కాబోర్లా పడ్డారు. గోదావరి నది జీవనది అంటూ ఫ్లో లో మాట్లాడి చివరకు తడబడుతూ పొరబడుతూ తప్పులో కాలేశారు. గోదావరి నది ఏపీ నుంచి పారుతూ పారుతూ తెలంగాణకు వచ్చి బంగాళాఖాతంలో కలుస్తుందని చెప్పుకొచ్చారు. ఇక్కడే అడ్డంగా దొరికిపోయారు. దాంతో సోషల్ మీడియాలో పలు కామెంట్లు వినిపిస్తున్నాయి. మినిమం ఐడియా లేని ఈ నాయకులు మనల్ని పాలిస్తారంటా అని ఒకరంటే.. ఎవరీ ఆణిముత్యం అంటూ మరికొందరు కామెంటుతున్నారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించి ఆ తర్వాత ఏపీ లోకి ప్రవహించి ఉభయ గోదావరి జిల్లాల గుండా పారుతూ చివరకు బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇదీ మ్యాటర్.. కానీ ఈ వారసత్వ లీడర్ అలా చెప్పుకొచ్చి నవ్వులపాలయ్యారు.
హయత్నగర్ బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ కేసు.. అసలు కథ ఇదే.. నిందితుడు ఏమన్నాడంటే..!
తలసాని పట్టు.. తనయుడేమో ఇట్లు
వారసత్వ రాజకీయాలు కొత్త కావు. గతంలో చాలామంది వచ్చారు. ఇప్పుడూ కూడా అనేకమంది ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. అయితే తండ్రుల నుంచి రాజకీయ లక్షణాలు పుణికిపుచ్చుకుని రాణిస్తున్నవారు లేకపోలేదు. సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్, కూతురు కవిత రాజకీయాల్లో ఆరితేరారు. వారసత్వ రాజకీయాలకు సరికొత్త భాష్యం చెప్పారు. అదలావుంటే కొంతమంది నేతల పుత్రరత్నాలు మాత్రం తండ్రుల వారసత్వాన్ని సరిగా అందిపుచ్చుకోలేకపోతున్నారు.
మంత్రి తలసాని యాదవ్ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదొడుకులు చవిచూశారు. ఇవాళ మంత్రిగా కొలువుదీరాలంటే ఆ పదవి ఆషామాషీగా రాలేదు. ఎన్నో ఏళ్ల నిరంతర శ్రమ దాగి ఉంది. అయితే ఆయన తనయుడిని వారసుడిగా ప్రమోట్ చేసే విషయంలో తప్పటడుగులు పడుతున్నాయి. సికింద్రాబాద్ ప్రాంతంలో ఏ చిన్న పండుగ జరిగినా.. కార్యక్రమం నిర్వహించినా సాయికిరణ్ యాదవ్ ఫ్లెక్సీలు వందల సంఖ్యలో కనబడతాయి. అంతేకాదు మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ను ఒప్పించి మెప్పించి తనయుడికి ఎంపీ టికెట్ తెచ్చుకున్నప్పటికీ.. గెలవకపోవడానికి ఎవరూ కారణమనేది ఈ ఇంటర్వ్యూ ఎపిసోడ్తో స్పష్టమవుతుంది.
లక్కీగా పొలిటికల్ ఎంట్రీ.. జెండాలు మోయకుండా..!
వారసత్వ రాజకీయాలతో లక్కీగా పొలిటికల్ ఎంట్రీ ఇద్దామనుకునేవారికి తలసాని సాయికిరణ్ యాదవ్ ఇంటర్వ్యూ ఎపిసోడ్ పెద్ద గుణపాఠమని చెప్పాలి. ఆయా అంశాలపై ఎలాంటి అవగాహన లేకుండా చట్టసభలకు వెళితే అక్కడ ఏమి మాట్లాడతారు.. ప్రజా సమస్యలను సభ దృష్టికి ఎలా తీసుకెళతారు. పార్టీ జెండాలు మోసి ప్రజా సమస్యలపై అవగాహన ఉన్నవారిని నేతలుగా ఎదగకుండా.. ఇలాంటి రాజకీయ వారసులు తెరమీదకొస్తే పరిణామాలు ఎలా ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు.
గోదావరి నది పారే తీరుకు కొత్త భాష్యం చెప్పిన సాయికిరణ్ యాదవ్.. బీకామ్లో ఫిజిక్స్ చదివిన జలీల్ఖాన్ను మించిపోయారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి వారసులొస్తే ప్రజా సంక్షేమం ఏమో గానీ ఇబ్బందులు మాత్రం పుష్కలమనే వాదనలు కూడా లేకపోలేదు.