కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి: తెలంగాణలో ఎన్ని కేంద్రాల్లో టీకా
హైదరాబాద్: దేశవ్యాప్తంగా రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ సోమవారం ఆరంభమైంది. 60 సంవత్సరాలకు పైగా వయస్సున్న వృద్ధులు, వేర్వేరు అనారోగ్య కారణాలతో బాధపడుతోన్న 45 సంవత్సరాలు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్ అందజేస్తోన్నారు. దీనికోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాను ముందుండి వ్యాక్సిన్ వేయించుకున్నారు. టీకా తీసుకుని.. రెండో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయనే ప్రారంభించారు. దేశ రాజధానిలోని ఎయిమ్స్లో ప్రధానికి వ్యాక్సిన్ ఇంజెక్షన్ ఇచ్చారు. అదేరోజు ఇద్దరు ముఖ్యమంత్రులు, పలువురు కేంద్రమంత్రులు సైతం టీకాను తీసుకున్నారు.
ఈటెల రాజేందర్తో కలిసి..
తాజాగా- కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జీ కిషన్ రెడ్డి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. కొద్దిసేపటి కిందటే ఆయనకు సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో వ్యాక్సిన్ వేశారు. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి వెంట ఉన్నారు. ఈటెల రాజేందర్తో కలిసి ఈ తెల్లవారు జామున ఆయన గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. నేరుగా వ్యాక్సినేషన్ విభాగానికి వెళ్లారు. అప్పటికే అక్కడ సిద్ధం చేసి ఉంచిన టీకాను కిషన్ రెడ్డి కుడిచేతికి ఇంజెక్ట్ చేశారు. అనంతరం ఆయన తన పేరు, ఇతర వివరాలను నమోదు చేశారు.
పోర్టల్లో రిజిస్ట్రేషన్..
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని, ప్రధానమంత్రి ముందుండి టీకా తీసుకున్నారని అన్నారు. వ్యాక్సిన్ వేయించుకోదలిచిన వారు కోవిడ్ పోర్టల్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. పోర్టల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అర్హులు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్ను అందజేస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారు.
ఒక్క రూపాయి కూడా ఎక్కువ చెల్లించొద్దు..
ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రమే డోసుకు 250 రూపాయలను వసూలు చేస్తున్నారని అన్నారు. దీనికి మించి ఒక్క రూపాయిని కూడా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. దేశవ్యాప్తంగా 10 వేల కేంద్రాల్లో ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నామని అన్నారు. ఈ సంఖ్యను 20 వేలకు పెంచుతామని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని ఆధారంగా వ్యాక్సినేషన్ కేంద్రాల సంఖ్యను పెంచుతామని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వానికి చెందిన 91 కేంద్రాలు, 46 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. ఈ సంఖ్యను మున్ముందు భారీగా పెంచుతామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.
నిర్లక్ష్యం వద్దు..
రెండు డోసులు తీసుకుంటేనే వ్యాక్సిన్ ఫలితం ఉంటుందని అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నామనే ఉద్దేశంతో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని కిషన్ రెడ్డి ప్రజలకు విజ్ఙప్తి చేశారు. ఇదివరకట్లా కరోనా మార్గదర్శకాల, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. మంత్రి ఈటెల రాజేందర్, గాంధీ ఆసుపత్రి డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, హెల్త్ వర్కర్లు వ్యాక్సిన్లు తీసుకున్నారని, ఎవరిలోనూ ఎలాంటి దుష్ప్రభావం కనిపించలేదని చెప్పారు. టీకా తీసుకోవడం వల్ల కొత్త అనారోగ్య సమస్యలు వస్తాయనే భయం వద్దని కిషన్ రెడ్డి అన్నారు.