31 తర్వాత ఎప్పుడైనా సరే.. మున్సిపోల్స్కు సిద్దంగా ఉండండి.. కలెక్టర్లకు ఈసీ సూచన..!
హైదరాబాద్ : తెలంగాణలో పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థలకు సంబంధించి పాలకవర్గం గడువు ముగిసి నెలలు గడుస్తున్నా ఎన్నికల నిర్వహణ ఓ కొలిక్కి రాలేదు. మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియను సవాల్ చేస్తూ హైకోర్టులో వివిధ పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఇటీవల వాటన్నింటినీ న్యాయస్థానం కొట్టివేయడంతో ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలగినట్లైంది. అదలావుంటే ఈ నెల 31వ తేదీన హైకోర్టు తుది తీర్పు తర్వాత ఎప్పుడైనా మున్సిపోల్స్ జరిగే అవకాశముందని.. ఆయా జిల్లాల కలెక్టర్లు సిద్దంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పురబరిలో నిలిచేందుకు యువత ఆసక్తి
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి పురబరిలో నిలిచి తమ అదృష్టం పరీక్షించుకోవడానికి యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పోటీ పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే మున్సిపోల్స్ నిర్వహణపై హైకోర్టులో వివిధ పిటిషన్లు దాఖలు కావడంతో విచారణ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇటీవల ఆ వ్యాజ్యాలను న్యాయస్థానం కొట్టివేయడంతో ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ దొరికినట్లైంది.
ఇద్దరితో ప్రేమాయణం, రాసలీలలు.. తల్లి హత్య కేసులో ట్విస్టులెన్నో..!
31వ తేదీ హైకోర్టు తీర్పు కీలకం.. కలెక్టర్లు రెడీగా ఉండాలంటూ..!
ఈ నెల 31వ తేదీన హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు అలర్టయ్యారు. న్యాయస్థానం తీర్పు తర్వాత ఎప్పుడైనా సరే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేలా జిల్లా కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని స్టేట్ ఈసీ కమిషనర్ నాగిరెడ్డి సూచించారు. మంగళవారం నాడు జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ విషయం వెల్లడించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 120 మున్సిపాలిటీలకు.. 9 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు.
3,103 వార్డులు.. 8,056 పోలింగ్ కేంద్రాలు
అదలావుంటే మీర్పేట కార్పొరేషన్లో మాత్రం వార్డుల విభజన జరగని కారణంగా అక్కడ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదన్నారు. అది తప్పించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3 వేల 103 వార్డుల్లో ఎన్నికల నిర్వహణ చేపట్టనున్నట్లు వివరించారు. ఆ క్రమంలో 8 వేల 56 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించడానికి సన్నాహాలు చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. అదలావుంటే మున్సిపాలిటీ పరిధిలో పోటీ చేసే అభ్యర్థులు లక్ష రూపాయలు మించకుండా ఖర్చు చేయాలని.. అదే కార్పొరేషన్లో ఐతే లక్షన్నర వరకు మాత్రమే పరిమితి విధించినట్లు తెలిపారు.
ఆర్టీసీ సమ్మె చరిత్రాత్మకం.. 25 రోజులుగా ఆందోళన పర్వం.. సకల జనభేరికి సన్నద్ధం
ఓటర్లు ఎంతమంది అంటే
రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు కలిపి మొత్తం 79 లక్షల 92 వేల 434 మంది ఓటర్లు ఉన్నారని నాగిరెడ్డి వెల్లడించారు. మున్సిపోల్స్ను పకడ్బందీగా నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఇటీవల హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన నేపథ్యంలో అక్కడి ఓటర్లకు ఎడమ చేతి మధ్యన వేలుకు సిరా చుక్క వేయాలని డిసైడ్ చేసినట్లు ఆయన వివరించారు. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం కావడంతో బరిలో నిలవనున్న అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.