బ్యాలెట్ బాక్సులో చిట్టీ, దివ్యాంగుల పేరుతో దర్శనం, మంత్రి కేటీఆర్కు విన్నపాలు..
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మంథని బ్యాలెట్ బాక్సుల్లో చిట్టీలు కనిపించాయి. దివ్యాంగుల పేరుతో చిట్టీ కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అందులో తమ సమస్యలను వారు విన్నవించుకున్నారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని భావించి.. వారు ఎన్నికల సమయంలో బ్యాలెట్ బాక్సుల్లో చిట్టీ వేశారు.
దివ్యాంగుల పేరుతో
తెలంగాణ వెన్నెముక గాయ దివ్యాంగుల పేరుతో చిట్టీ ఉంది. ఇందులో తమ సమస్యలను వారు తెలియజేశారు. తమ జీవితాలు దుర్భంగా ఉన్నాయని మొర పెట్టుకున్నారు. తమ సమస్యలను మంత్రి కేటీఆర్కు చెప్పాలనుకొంటున్నామని అందులో రాశారు. కేటీఆర్ను కలిసి ఇబ్బందులను తెలియజేస్తామని చిట్టీల్లో దివ్యాంగులు పేర్కొన్నారు.
ఆశ్చర్యం..
మొత్తానికి బ్యాలెట్ బాక్సుల్లో చిట్టీలు దర్శనం ఇవ్వడం చర్చకు దారితీసింది. మొత్తం 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. వార్డులు, డివిజన్లవారీగా ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. 5 నుంచి 24 రౌండ్లలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగియనుంది. కాగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఫలితాల్లో దూసుకెళ్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో పాగా వేసుకుంటూ వెళ్తుంది.
గులాబీ జోరు
ఇటు జగిత్యాల జిల్లాలో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. జగిత్యాల మున్సిపాలిటీలో 48 వార్డులు ఉన్నాయి. జగిత్యాలలో రెండు వార్డుల్లో టీఆర్ఎస్, కోరుట్లలో ఒక వార్డులో అధికార పార్టీ అభ్యర్థి గెలుపొందారు. సిట్టింగ్ స్థానాలతో పాటు మిగతా చోట్ల కూడా టీఆర్ఎస్ విజయం దిశగా పయనిస్తోంది.