డాక్టర్ నుంచి రాజ్ భవన్ దాకా.. రాజకీయాల్లో చురుకుగా.. తెలంగాణ కొత్త గవర్నర్ ప్రస్థానం
హైదరాబాద్ : డాక్టర్ నుంచి రాజ్ భవన్ దాకా వచ్చారు. చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తితో గవర్నర్గా ఎదిగారు. కుటుంబ నేపథ్యానికి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. వైద్య వృత్తిలో రాణించి రాజకీయ తెరంగేట్రం చేసి వెనుదిరిగి చూసుకోలేదు. తెలంగాణ కొత్త గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన తమిళిసై సౌందరరాజన్ ప్రస్థానంపై వన్ఇండియా తెలుగు ప్రత్యేక కథనం.
ఫ్యామిలీ నేపథ్యం.. చిననాటి నుంచే రాజకీయాలపై ఆసక్తి
తెలంగాణకు రెండో గవర్నర్గా, తొలి మహిళా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన తమిళిసై సౌందరరాజన్ ప్రత్యేక గుర్తింపు పొందారు. కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్లో 1961, జూన్ 2వ తేదీన కృష్ణ కుమారి, అనంతన్ దంపతులకు ఆమె జన్మించారు. తమిళిసై సౌందరరాజన్ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె తండ్రి అనంతన్ తమిళనాడు కాంగ్రెస్ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించారు. ఆ పార్టీ సీనియర్ నేతగా, ఎంపీగా పనిచేశారు. అయితే చిననాటి నుంచే ఫ్యామిలీలో పొలిటికల్ టచ్ ఉండటంతో తమిళిసై సౌందరరాజన్కు కూడా రాజకీయాలపై ఆసక్తి ఉండేది. ఆ క్రమంలో ఆమె డాక్టర్ వృత్తి నుంచి గవర్నర్ దాకా ఎదిగారు.
ఎంబీబీఎస్ చదివి.. డాక్టర్గా సేవలందించి
తమిళిసై సౌందరరాజన్ మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుకున్నారు. అయితే రాజకీయాల్లోకి రావడానికి ముందు చెన్నైలోని రామచంద్ర మెడికల్ కాలేజీలో ఐదేళ్లు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. పలు ఆసుపత్రులకు విజిటింగ్ కన్సల్టెంట్గా కూడా ఉండేవారు. ఆమె భర్త సౌందరరాజన్ కూడా వైద్యుడే కావడం విశేషం. అయితే వైద్య వృత్తిలో కొనసాగిన ఆమెకు చిననాటి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉండటంతో ఈ రంగంలోకి వచ్చారు.
కాలేజీలోనే స్టూడెంట్ లీడర్.. బీజేపీకి విశిష్ట సేవలు
రాజకీయ కుటుంబ నేపథ్యం.. చిననాటి నుంచే ఆ రంగంపై ఆసక్తి కారణంగా మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడే స్టూడెంట్ లీడర్గా ఎన్నికయ్యారు తమిళిసై సౌందరరాజన్. ఇంట్లో అంతా కాంగ్రెస్ ఫ్లేవర్ ఉన్నప్పటికీ.. ఈమె మాత్రం బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. అలా బీజేపీకి పూర్తిస్థాయి కార్యకర్తగా పనిచేశారు. అంతేకాదు రాష్ట్ర స్థాయిలో బీజేపీలో వివిధ హోదాల్లో కొనసాగారు. 2010లో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, 2013లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2014 ఆగస్టులో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు.
ప్రజా ప్రతినిధిగా కలిసిరాని కాలం.. ఇలా గవర్నర్గా..!
అదలావుంటే సుదీర్ఘ రాజకీయ నేపథ్యమున్న తమిళిసై సౌందరరాజన్ ప్రజా ప్రతినిధిగా మాత్రం చట్టసభలకు వెళ్లలేకపోయారు. 2006, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆమెకు కలిసిరాలేదు. ఫలితంగా ఆ రెండు సార్లు కూడా ఓడిపోయారు. 2009, 2019 లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసినప్పటికీ గెలుపొందలేదు. అయితే మొన్నటి ఎన్నికల సందర్భంగా బీజేపీకి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేశారు. ఆ క్రమంలో హైకమాండ్ దృష్టిని ఆకర్షించిన తమిళిసై సౌందరరాజన్కు తెలంగాణ గవర్నర్ పదవి దక్కింది.