ఖాకీల ప్రవర్తన సరిగా లేదు.. జైళ్లల్లో పేదలే.. పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ హాట్ కామెంట్స్..!
హైదరాబాద్ : సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్ కుమార్ సింగ్ అలియాస్ వీకే సింగ్ బాంబ్ పేల్చారు. రాజకీయాలతో బంగారు తెలంగాణ సాధ్యం కాదంటూ ఇదివరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే క్రమంలో తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా కొనసాగుతున్న వీకే సింగ్.. తాజాగా ఆ శాఖపై మాట్లాడిన తీరు ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు తెలంగాణ పోలీస్ అకాడమీ వల్ల ఎలాంటి లాభం లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులు వృధా ప్రయాసేనంటూ మండిపడ్డారు. ఇక జైలుకు వెళుతున్న వారిలో 90 శాతం మంది పేదలేనంటూ ఆయన వ్యాఖ్యానించడం మరో సంచలనానికి తెర లేపింది.
తెలంగాణ పోలీస్ అకాడమీపై వీకే సింగ్ హాట్ కామెంట్స్
తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ హోదాలో వీకే సింగ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ పోలీస్ అకాడమీ వల్ల నో యూజ్ అంటూ తేల్చి చెప్పారు. పోలీసుల ప్రవర్తన సరిగా లేదని స్పష్టం చేశారు. జైలుకు వెళుతున్న వారిలో 90 శాతం మంది పేదలేనని.. తినడానికి తిండి లేనోళ్లే జైళ్లల్లో మగ్గుతున్నారని ఆరోపించారు. అదలావుంటే తాము జైలుకు ఎందుకొచ్చామో తెలియని పరిస్థితి కొందరిదని వ్యాఖ్యానించారు. మొత్తానికి పోలీస్ అకాడమీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు నేషనల్ పోలీస్ అకాడమీ పరిస్థితి కూడా బాగా లేదని చెప్పుకొచ్చారు.
జగిత్యాల జిల్లాలో చిరుత కలకలం.. మామిడి తోటలో అడ్డా.. భయాందోళనలో స్థానికులు..!
గతంలోనూ ఇలాగే.. బంగారు తెలంగాణపై సంచలన వ్యాఖ్యలు..!
ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా ఉన్న వీకే సింగ్ను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసి.. పోలీస్ అకాడమీ డైరెక్టర్గా నియమించింది. అయితే ప్రిటింగ్ అండ్ స్టేషనరీ డైరెక్టర్ జనరల్గా ఉన్న సమయంలోనూ ఆయన హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయాలతో బంగారు తెలంగాణ రాదని బాంబ్ పేల్చారు. తెలంగాణ అభివృద్ది కోసం తానే ఓ మిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తాను తీసుకొచ్చే పాలసీలు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు.
అదలావుంటే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగంలో చేయడానికి పని లేదని ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు. దీనిని మూసివేయాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాస్తానని అప్పట్లో సంచలనానికి తెర లెపారు. ఈ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికి 50 కోట్ల రూపాయల నష్టం వస్తుందని కుండబద్దలు కొట్టారు. ఇక్కడ పనిచేసే వాళ్లు చాలామందే ఉన్నా.. వారికి రోజుకు 2 గంటల పని మాత్రమే ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జులై చివరి వారంలో ఈ విధంగా మాట్లాడిన వీకే సింగ్ తెలంగాణ సర్కార్కు గట్టిగానే చురకలు అంటించారు.
సొంత నిర్ణయాలు తీసుకుంటారని..!
1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన వీకే సింగ్కు సుమారుగా మరో రెండేళ్ల సర్వీసు ఉంది. ప్రస్తుతం ఆయన అదనపు డీజీపీ హోదాలో కొనసాగుతున్నారు. రెండేళ్ల నుంచి ఆయనకు డీజీపీ పదోన్నతి కూడా పెండింగ్లో ఉంది. వీకే సింగ్ ఉమ్మడి ఏపీలో పలు జిల్లాలకు ఎస్పీగా విధులు నిర్వహించారు. 2001 నుంచి 2005 వరకు సొంత రాష్ట్రమైన బీహార్కు డిప్యుటేషన్పై వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీకే సింగ్ను జైళ్ల శాఖ నూతన డీజీగా నియమించింది. ప్రభుత్వ అంగీకారం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటారనే ఆరోపణలున్నాయి. ఆ క్రమంలోనే ఆ మధ్య ఆయనను ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ శాఖ కమిషనర్గా ప్రభుత్వం బదిలీ చేసినట్లు తెలుస్తోంది.
వారెవ్వా క్యా సీన్ హై : పొత్తుల్లో ట్విస్టులు.. లాల్ జెండా నీడలోనా కారు..!
ప్రభుత్వం కక్ష సాధిస్తోందా.. వీకే సింగ్ మాటల మర్మమేంటో..!
గతంలో సైబరాబాద్ సీపీగా పనిచేసిన వీకే సింగ్ పనితీరుకు నిదర్శనంగా దేశంలోనే అత్యున్నత పురస్కారమైన రాష్ట్రపతి పోలీస్ పతకం వరించింది. ఆ తర్వాత జైళ్ల శాఖ డీజీగా ఐదేళ్లు పనిచేసి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితోనే తనకు అప్రాధాన్య పోస్టు కట్టబెట్టిందనేది ఆయన వెర్షన్. ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ శాఖ కమిషనర్ పోస్టును అదనపు బాధ్యతలుగా కేటాయించేవారని.. తనకు మాత్రం పూర్తిస్థాయి పోస్టింగ్ ఇచ్చి అవమానించారని చాలా సందర్భాల్లో వాపోయారు వీకే సింగ్. మొత్తానికి పోలీస్ అకాడమీగా డైరెక్టర్గా కొనసాగుతూ ఆ శాఖను కౌంటర్ చేయడం హాట్ టాపిక్ అయింది.